సిటీబ్యూరో, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాలకు సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా మంగళవారం నుంచి ఇంటింటికీ జాతీయ జెండాల పంపిణీని ప్రారంభిస్తున్నది. మంగళవారం ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.
ఆ తర్వాత గ్రేటర్ అధికారుల ఆధ్వర్యంలో స్వయం సహాయక బృందాలు, ఇతర విభాగాల సిబ్బందితో కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టనున్నారు. ఈ క్రమంలో గ్రేటర్ ప్రజలంతా ఉత్సవాల్లో భాగస్వాములు కావాలని గ్రేటర్ కమిషనర్ లోకేశ్కుమార్ పిలుపునిచ్చారు. ఇంటింటికీ త్రివర్ణ పతాకం అందుకున్న ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై తప్పనిసరిగా జెండా ఎగుర వేసి, దేశ ప్రతిష్టను ఇనుమడింపజేయాలన్నారు. ముఖ్యంగా జాతీయ జెండా ప్రొటోకాల్ను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు.
వజ్రోత్సవాల్లో భాగంగా విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించేందుకు గాంధీజీ చిత్రాలను ప్రత్యేక షోల ద్వారా ప్రదర్శించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గ్రేటర్వ్యాప్తంగా ఉన్న అనేక సినిమా థియేటర్లలోనూ పాఠశాలల విద్యార్థులు ఈ చిత్రాలు వీక్షించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మంగళవారం అధికారికంగా వెలువడనున్నాయి.