సికింద్రాబాద్, ఆగస్టు 8: కస్టమర్ కేర్ ఉద్యోగినంటూ పరిచయమైన ఆగంతకుడు ఓ వృద్ధుడికి మాయమాటలు చెప్పి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా రూ.94,010లు తస్కరించాడు. బోయిన్పల్లి ఇన్స్పెక్టర్ రవికుమార్ కథనం ప్రకారం.. న్యూబోయిన్పల్లి రాంగోపాల్ ఎన్క్లేవ్కు చెందిన రేకల సామ్ అమృతరావు విశ్రాంత ఉద్యోగి. గతనెల 27న అతడు గోద్రేజ్ కస్టమర్ కేర్ నంబరు కోసం గూగుల్లో సెర్చ్ చేస్తుండగా ఓ నంబర్ దొరికింది. సదరు నంబర్కు ఫోన్చేయగా తాను కంపెనీ కస్టమర్ కేర్ ఉద్యోగినంటూ ఓ వ్యక్తి పరిచయం చేసుకున్నాడు.
ఆ ఆగంతకుడు ఫిర్యాదును స్వీకరించడానికి ముందు రూ.10లు గూగుల్ పే ద్వారా పంపాలని సూచించాడు. ఆ యాప్ను తాను వినియోగించనని, తనవద్ద ఇంటర్నెట్ బ్యాంకింగ్ అందుబాటులో ఉన్నదని బాధితుడు చెప్పాడు. దీంతో ఆగంతకుడు టీమ్ వ్యూవర్ క్విక్ సపోర్టు యాప్ను ఇన్స్టాల్ చేసుకొని, ఆ యాప్ ద్వారా తనకు యాక్సిస్ ఇవ్వాలని సూచించాడు. ఆగంతకుడి సూచన మేరకు యాక్సిస్ ఇచ్చిన బాధితుడు పలుమార్లు ఓటీపీని అతడికి చెప్పాడు.
ఆ తర్వాత బాధితుడి బ్యాంకు ఖాతాలో నుంచి తొలుత రూ.10, ఆ తర్వాత రూ.44వేలు, అనంతరం రూ.50 వేలు.. ఐఎన్బీ పే టీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ ఖాతాలో జమ అయ్యాయి. తన ఖాతాలో నుంచి డబ్బులు పోయాయని బాధితుడు ప్రశ్నించగా.. తిరిగి ఖాతాలో జమచేస్తాం.. మరోసారి ఓటీపీ నంబర్ను చెప్పాలని ఆగంతకుడు సూచించాడు. ఈసారి బాధితుడు ఓటీపీ చెప్పలేదు. మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు బోయిన్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.