సిటీబ్యూరో, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ)/కొండాపూర్: పదవీవిరమణ పొందిన సీనియర్ల కోసం ఏర్పాటు చేసిన స్టార్టప్తో ఐఐటీ గౌహాతి విద్యాలయం జతకట్టింది. సోమవారం టీ హబ్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న గైడ్ ఎస్ఎంఈ (సబ్జెక్టు మ్యాటర్ ఎక్స్ఫర్ట్) కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, రిటైర్డ్ ప్రొఫెషనల్స్ స్థాపించిన స్టార్టప్తో ఐఐటీ గౌహతి బృందం అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. రిటైర్డ్ సీనియర్ల కోసం భారతదేశం నుంచి మొట్టమొదటి డిసవరీ ప్లాట్ ఫామ్గా సీనియర్ ఎక్స్పర్ట్స్ను(seniorexperts.in) ను అభివృద్ధి చేసింది.
పదవీ విరమణ పొందిన వారి సేవల కోసం పెరుగుతున్న అవసరాన్ని ఈ వేదిక తీరుస్తుందని ఐఐటీ గౌహతి ప్రొఫెసర్ చివుకుల వి.శాస్త్రి అన్నారు. ప్రస్తుతం దేశంలో 85% రిటైర్డ్ సీనియర్ నిపుణులు వారి పదవీ విరమణ తర్వాత కూడా ఉత్పాదకతను కలిగి ఉంటారని వివిధ సర్వేలు వెల్లడించాయి. దేశంలో 16 కోట్ల మంది సీనియర్ సిటిజన్లు ఉన్నారని తెలిపారు.
అందులో 6 కోట్ల మంది వేర్వేరు రంగాల్లో నిపుణులుగా ఉన్నారన్నారు. అలాంటి వారికి ఈ ప్లాట్ ఫారమ్ ఒక మధ్యవర్తిగా ఉండి వివిధ రంగాల పరిశ్రమల అవసరాలను తీరుస్తుందని పేర్కొన్నారు. జి.సి.ఎస్.పి.ఎల్ డైరెక్టర్లు అనిల్ కుమార్ సిద్దూ, పవన రాజ్ నేదునూరి మాట్లాడుతూ.. నైపుణ్యం కలిగిన రిటైర్డ్ సీనియర్ నిపుణులు పదవీ విరమణ తర్వాత బిజీగా ఉండాలని కోరుకుంటారన్నారు.
ఇప్పుడు ఈ కొత్త సీనియర్ ఎక్స్పర్ట్ వేదిక ద్వారా రిటైర్డ్ నిపుణుల సేవలను వినియోగించుకోవచ్చని సూచించారు. ఈ ఒప్పందం మూడు సంవత్సరాల పాటు కొనసాగుతుందని, ఆ తర్వాత పరస్పర అంగీకారంతో మరికొంత కాలం పొడిగించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు.