ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 8: తప్పుడు సమాచారం ప్రజాస్వామ్యానికి పెనుముప్పుగా పరిణమించిందని హైదరాబాద్లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ అసిస్టెంట్ పబ్లిక్ ఎఫైర్స్ ఆఫీసర్ ఫ్రాంకీ స్టర్మ్ అన్నారు. తప్పుడు సమాచారం, నకిలీ వార్తల గుర్తింపు కోసం జర్నలిస్టులు వినియోగించాల్సిన సాంకేతిక పరిజ్ఞానంపై యూఎస్ కాన్సులేట్ జనరల్, ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం విభాగం సంయుక్తంగా జాతీయ సదస్సు నిర్వహించాయి.
ఓయూ క్యాంపస్లోని సీఎఫ్ఆర్డీ భవనంలో నిర్వహించిన ఈ సదస్సులో ఫ్రాంకీ స్టర్మ్ మాట్లాడుతూ.. దురుద్దేశం లేకపోయినా, దురదృష్టవశాత్తు కొన్నిసార్లు చట్టబద్ధమైన మీడియా సంస్థల నుంచే తప్పుడు సమాచారం వ్యాప్తి జరుగుతున్నదని అన్నారు. ప్రజాప్రయోజనాల దృష్ట్యా తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవడం అత్యవసరమని ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ అన్నారు.
జర్నలిజంలో వస్తున్న ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు. జర్నలిజం విభాగం హెడ్ ప్రొఫెసర్ కె. స్టీవెన్సన్ మాట్లాడుతూ.. సమాచార వరద నుంచి వాస్తవాలను జల్లెడ పట్టడానికి క్లిష్టమైన ఆలోచనా పద్ధతులను వర్తింపజేయాలన్నారు. కేవలం వైరల్ అయిన సమాచారానికి మాత్రమే కాకుండా ప్రతి చిన్న సమాచారానికి కూడా ఫ్యాక్ట్ చెక్ అవసరమని అభిప్రాయపడ్డారు.
ప్రముఖ జర్నలిస్టు ఉడుముల సుధాకర్రెడ్డి, ఫ్యాక్ట్ చెకర్ సత్యప్రియ రచించిన ఫ్యాక్ట్ చెకింగ్ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ ట్రైనింగ్ మేనేజర్ అలనా సుజానే డ్వోరక్, టెక్సాస్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అనంత సుధాకర్ బబ్బిలి, ఫ్యాక్ట్ చెక్ ట్రైనర్లు ఉడుముల సుధాకర్రెడ్డి, కొరీనా సూర్స్, ప్రాజెక్టు సభ్యుడు ఎస్. రాము, యూఎస్ కాన్సులేట్ అధికారి అబ్దుల్ బాసిత్ తదితరులు పాల్గొన్నారు.