సిటీబ్యూరో, ఆగస్టు 8(నమస్తే తెలంగాణ): స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘15 రోజుల కార్యక్రమాలు – నగర పోలీసుల పాత్ర’పై సీవీ ఆనంద్ సిబ్బందికి మార్గ దర్శకాలు జారీ చేశారు. డీసీపీ, ఏసీపీ, ఎస్హెచ్ఓలతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు అంశాలపై చర్చించి, చేయాల్సిన పనులపై ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సమావేశంలో అదనపు సీపీ డీఎస్ చౌహాన్, జాయింట్ సీపీ విశ్వప్రసాద్, ఐటీ సెల్ డీసీపీ సతీశ్ పాల్గొన్నారు.
తెలుగు యూనివర్సిటీ, ఆగస్టు 8: ఆజాదీ కా అమృత్ మహోత్సవం, స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలలో దేశభక్తిని పెంపొందించాలనే లక్ష్యంతో ‘సర్వేజనా సుఖినోభవంతు’ సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో నగరంలో దేశభక్తి గీతాలు, నృత్యాంశాలు, కవితలు, దేశ నాయకుల వేషధారణ తదితర అంశాలలో ఔత్సాహిక కళాకారులకు ఆగస్టు 13, 14 తేదీలలో పోటీలు నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్షులు డాక్టర్ ఇ.ఎస్.ఎస్ నారాయణ మాస్టారు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలలో పాల్గొన్న వారికి బహుమతులు, సర్టిఫికెట్లు అందిస్తామని ఆయన పేర్కొన్నారు. ఆగస్టు 12లోపు ఫోన్ నం. 96523 47207లో సంప్రదించి పేరు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.