బంజారాహిల్స్,ఆగస్టు 8: భారత స్వాతంత్య్ర వజ్రోత్సవంలో భాగంగా ఈ నెల10న నిర్వహించనున్న వన మహోత్సవ కార్యక్రమానికి జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోన్ పరిధిలో ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. జోన్లోని సర్కిల్ -17, 18 పరిధిలో వజ్రోత్సవం సందర్భంగా 15 పార్కులను ఫ్రీడమ్ పార్కులుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, షేక్పేట, ఖైరతాబాద్, సోమాజిగూడ డివిజన్లలో 15 పార్కులను ఎంపిక చేశారు.
ఈ పార్కుల్లో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటనున్నారు. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఒక్కో పార్కులో కనిష్టంగా 75 మొక్కలను నాటాలని, అవకాశం ఉన్న పార్కుల్లో సుమారు 500 నుంచి 2వేల మొక్కలను నాటేలా ప్రణాళికలు రూపొందించారు. పార్కుల్లో మొక్కలు నాటడంతో పాటు పరిశుభ్రపరమైన వాతావరణం ఉండేలా కార్యక్రమాలు చేపట్టనున్నారు. దీనితో పాటు పార్కులో వాకర్ల సౌకర్యం కోసం బెంచీలను ఏర్పాటు చేయనున్నారు. పార్కులలోకి అసాంఘిక శక్తులు ప్రవేశించ కుండా గేట్లకు మరమ్మతులు చేస్తున్నారు.
అదేవిధంగా ప్రహరీగోడలకు రంగులు వేయడంతో పాటు ఆయా పార్కులకు ఫ్రీడమ్ పార్కులుగా నామకరణం చేసి బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. ఫ్రీడం పార్కుల్లో మొక్కలు నాటేందుకు పలు రకాలైన మొక్కలను జీహెచ్ఎంసీ యూబీడీ విభాగం అధికారులు సిద్ధం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 10(సీ)లోని విజయానర్సరీతో పాటు ఇందిరాపార్కులో కూడా మొక్కలు సిద్ధంగా ఉంచామని యూబీడీ విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.