సికింద్రాబాద్/బొల్లారం, ఆగస్టు 8: భారతదేశ చరిత్రలోనే 75వ స్వాతంత్య్ర దిన వేడుకలు అత్యంత పెద్ద ఉత్సవమని, ప్రతి పౌరుడు తమ దేశభక్తిని చాటేందుకు ప్రతి ఇంటా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించాలని సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సీఈవో అజిత్రెడ్డి పిలుపునిచ్చారు.
కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల మేరకు ఉత్సవాలలో భాగంగా బోర్డు కార్యాలయం ఎదురుగా కొత్తగా ఏర్పాటు చేసిన ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ లోగోను సీఈవో, బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణతో కలిసి సోమవారం ఆవిష్కరించారు. అనంతరం, ఏర్పాటు చేసిన సమావేశంలో సీఈవో మాట్లాడుతూ.. ఈ నెల 11 నుంచి 17 వరకు ఉత్సవాలను నిర్వహించనున్నామని పేర్కొన్నారు.
12 నుంచి 14వరకు కంటోన్మెంట్ వర్క్ షాపు, గాంధీ హట్స్, తిరుమలగిరి చిన్నమ్మ తోట ప్రాంతాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, 15న పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం, కరోనా కష్ట కాలంలో పనిచేసిన పారిశుద్ధ్య కార్మికుల సన్మాన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు. 16, 17 తేదీల్లో వర్క్ షాపులలో ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించి బోర్డు ఉద్యోగులకు బూస్టర్ డోస్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
బోర్డు పరిధిలో 10వేల ఇండ్లపై పతాకాలను ఎగురవేయించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్న తమకు ప్రతి పౌరుడు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పౌరులకు తమ వంతు సహకారాన్ని అందించేందుకు గాను స్వయంగా తాము ఐదువేల పతాకాలను ఇంటింటికీ అందజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో అధికారులు గోపాలకృష్ణదాస్, మహేందర్, పరశురామ్తో పలువురు సిబ్బంది పాల్గొన్నారు.
కంటోన్మెంట్ ఎనిమిదో వార్డు బొల్లారం బంజారా కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో తిరుమలగిరి ఐఓబీ కాలనీలో,బంజారా కాలనీలో స్వాతంత్య్ర వజ్రోత్సవం వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు ఆజాద్ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కంటోన్మెంట్ బోర్డు అధికారులు,మాజీ బోర్డు సభ్యులు,యువకులు, వృద్ధులు, చిన్నారులు మహిళలంతా జాతీయ జెండాలు చేతపట్టి కాలనీల్లో ర్యాలీ చేపట్టారు.ఈ కార్యక్రమంలో బోర్డు అధికారులు పరశురామ్,ఏడో వార్డు మాజీ బోర్డు సభ్యురాలు భాగ్యశ్రీ,బంజారా కాలనీ సెక్రటరీ వైవి.రావు, నాగేంద్ర,జయ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
స్వాతంత్య్ర భారత వజ్రోత్సవంలను ఆడంబరంగా నిర్వహించాలని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కంటోన్మెంట్ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వజ్రోత్సవంలను కన్నుల పండువగా నిర్వహించేందుకు కార్యాచరణను రూపొందించినట్లు పేర్కొన్నారు.
– కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి