కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు 8 : ఆరోగ్యమే మాహాభాగ్యమని, ప్రతి రోజు వ్యాయామం, నడక, యోగ సాధనతో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సోమవారం కేపీహెచ్బీ కాలనీ డివిజన్ ఎన్ఆర్ఎస్ఏ కాలనీలో షటిల్ కోర్టు, డైమాండ్ హిల్స్లో ఓపెన్ జిమ్లను ఎమ్మెల్యే కృష్ణారావు, కార్పొరేటర్ శ్రీనివాస్రావులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేపీహెచ్బీ కాలనీలో నిరుపయోగంగా ఉన్న ఖాళీ స్థలాలను పార్కులుగా, క్రీడా ప్రాంగణాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
ఇప్పటికే కాలనీలో మహిళలు, చిన్నారుల కోసం ప్రత్యేక పార్కును నిర్మించి అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రతి ఏరియాలో పార్కు, క్రీడా ప్రాంగణం ఉండేలా పనులు చేస్తున్నట్లు తెలిపారు. కాలనీ 5వ ఫేజ్లో ఐదెకరాల స్థలంలో కేబీఆర్ పార్కు తరహాలో పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. డైమాండ్ హిల్స్, ఎన్ఆర్ఎస్ఏ కాలనీలో ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని అసోసియేషన్ ప్రతినిధులకు హామీనిచ్చారు.
కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, ఎన్ఆర్ఎస్ఏ కాలనీ అధ్యక్షుడు కె.హన్మంతరావు, ఉపాధ్యక్షుడు నాగయ్య, ఐడీపీల్ కాలనీ అధ్యక్షుడు బసవరాజు, ఉపాధ్యక్షుడు గుప్తా, మెడోలాండ్ అధ్యక్షుడు వెంకట్, ఉపాధ్యక్షుడు భరత్, వసంతనగర్ కాలనీ అధ్యక్షుడు ఎర్ర నాగేశ్వర్రావు, సత్యనారాయణ, వంశీ, సాయిశ్రీనివాస్, సూరిబాబు, కాలనీ వాసులు ఉన్నారు.
మూసాపేట, ఆగస్టు8: నియోజకవర్గం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. సోమవారం మూసాపేట డివిజన్ పరిధి గూడ్స్షేడ్ రోడ్డులో రూ.75లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మోతినగర్లో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బస్తీలు, కాలనీల్లో కనీస సౌకర్యాలు, మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మూసాపేట డివిజన్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎప్పటికప్పుడు తెలుసుకొని అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ప్రజల ఆరోగ్యం కోసం డివిజన్ పరిధిలో మరిన్ని ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ కోడిచర్ల మహేందర్, మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్కుమార్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు అంబటి శ్రీనివాస్, జిల్లా గోపాల్, సత్యం, ప్రధాన కార్యదర్శి తిరుపతి, ఉదయ్, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.