సిటీబ్యూరో, జూన్ 26 (నమస్తే తెలంగాణ): మ్యాట్రిమోనీ వేదికలో ఒక మహిళగా పరిచయం చేసుకుని పెండ్ల్లి చేసుకుంటామంటూ నమ్మించి ఒక నకిలీ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్లో భారీగా పెట్టుబడి పెట్టించి మోసం చేసిన కేసులో నలుగురు కేటుగాళ్లను హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో సైబర్ క్రైమ్ పోలీసులకు బాధితుడి నుంచి ఫిర్యాదు అందింది. సంగం మ్యాట్రిమోనీలో నిందితులు ఒక మహిళగా నటిస్తూ బాధితుడితో పరిచయం పెంచుకున్నారు.
పెండ్ల్లి చేసుకుంటామని నమ్మించి, అధిక లాభాలు వస్తాయంటూ ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీలో పెట్టుబడి పెట్టేలా బాధితుడిని ప్రలోభపెట్టారు. స్క్రీన్పై నకిలీ లాభాలను చూపిస్తూ బాధితుడి నుంచి విడతల వారీగా వివిధ బ్యాంక్ ఖాతాల్లోకి మొత్తం రూ.1.46కోట్లు బదిలీ చేయించుకున్నారు. ఆ తర్వాత బాధితుడు తన డబ్బును వచ్చిన లాభాలతో కలిపి విత్ డ్రా చేసుకోవడానికి ప్రయత్నించగా, మరిన్ని అదనపు రుసుములు చెల్లించాలని డిమాండ్ చేస్తూ విత్ డ్రాలను నిలిపివేశారు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు సిద్దిపేటకు చెందిన చొక్కాల సంపత్, సికింద్రాబాద్కు చెందిన హెచ్చు నరేశ్, ఎండ్ల సురేశ్, వడ్కల మహేశ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాననిందితుడు పరారీలో ఉండగా ఈ నలుగురు నిందితులు పలు నకిలీ బ్యాంక్ ఖాతాలను ఉపయోగించి రూ.46.65 లక్షలు డ్రా చేసి ఆ నిధులను హవాలా నెట్వర్క్ ద్వారా సింగపూర్కు చెందిన సైబర్ నేరగాళ్లకు చేరవేసినట్లు విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు.
ఈ దర్యాప్తులో భాగంగా నగదు బదిలీకి ఉపయోగించిన మ్యూల్ బ్యాంక్ ఖాతాలు మహారాష్ట్ర, తెలంగాణ రాష్ర్టాల్లో విస్తరించి ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఖాతాల ద్వారా సుమారు రూ.35లక్షలు చేతులు మారినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నిందితులంతా ప్రధాన నిందితుడి ఆదేశాల మేరకు పనిచేశారని, మ్యాట్రిమోనీలో నమోదు చేసుకున్నవారిని గుర్తించి వారిని ఉచ్చులోకి దింపి నెమ్మదిగా వారితో నకిలీ కంపెనీలలో పెట్టుబడులు పెట్టించడం, దానిద్వారా మ్యూల్ఖాతాల్లోకి డబ్బులు పంపించడం చేసేవారని పోలీసులు చెప్పారు. అరస్టైన నలుగురు 10శాతం నుంచి 30శాతం వరకు కమీషన్ తీసుకునేవారని, మ్యూల్ ఖాతాలనుంచి డబ్బులను విత్ డ్రా చేయడంతో ప్రధాననిందితులకు సహకరించినట్లుగా పోలీసులు తెలిపారు.