Cyber Fraud | హైదరాబాద్ నగరానికి చెందిన యువతిని విదేశాలకు పంపిస్తానని చెప్పి రూ.2.71కోట్లు అకౌంట్ల నుంచి లూటీ చేసిన సైబర్ నేరగాడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. నగర పరిధిలోని మధినగూడకు చెందిన యువతికి మ్యాట్రిమోనిలో శ్రీ బాల వంశీకృష్ణ వ్యక్తి పరిచయమయ్యాడు. తాను గ్లెన్మార్క్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్గా పని చేస్తున్నానని నమ్మబలికాడు. యువతిని అమెరికా తీసుకెళ్తానని నమ్మబలికాడు. అయితే, యూఎస్ పార్ట్నర్ వీసా కోసం సిబిల్ స్కోర్ 850 ఉండాలని చెప్పాడు.
సిబిల్ స్కోర్ తక్కువగా ఉందని అమెరికా వెళ్లేందుకు సిబిల్ స్కోర్ పెంచి.. కంపెని నుంచి రుణాలు ఇప్పిస్తానని నమ్మించాడు. ఆమెకు సంబంధించిన బ్యాంకు ఖాతాల వివరాలు అన్నీ తెలుసుకున్నాడు. విడతల వారీగా రూ.2.71కోట్లు కాజేశాడు. అయితే, తాను మోసపోయాయని భావించిన బాధితురాలు ఈ నెల 16న పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి.. నిందితుడు వంశీకృష్ణను అరెస్టు చేశారు. అతడి నుంచి ఆరు పాస్బుక్లు, పది డెబిట్కార్డులు, మూడు సెల్ఫోన్లు, నాలుగు సిమ్కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.