Hyderabad | హైదరాబాద్ : ఈ నెల 17వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్లో శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఈ మేరకు శ్రీరామనవమి శోభాయాత్ర నిర్వహణపై పోలీసులు, వివిధ శాఖ అధికారులతో హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. గతేడాది జరిగిన పొరపాట్లు ఈసారి పునరావృతం కానివొద్దని సూచించారు. వేడుకల సమయంలో హైదరాబాద్లో మత సామరస్యం వెల్లివిరియాలన్నారు.
శ్రీరామనవమికి సమయం తక్కువగా ఉందని, అధికారులు సెలవు రోజుల్లో కూడా పని చేయాలని సీపీ ఆదేశించారు. తాగునీరు, డ్రైనేజీ సమస్యలు లేకుండా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. రోడ్లపై చెత్త ఉండకుండా చూడాలని సూచించారు. శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, బోనాలు, గణేశ్ ఉత్సవాలు, విజయదశమి పండుగల నిర్వహణలో హైదరాబాద్ను ఆదర్శంగా నిలపాలని పిలుపునిచ్చారు. వీలైనంత త్వరగా శోభాయాత్ర నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల కోడ్ ఉల్లంఘించకూడదని, ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయకూడదని హెచ్చరించారు.