హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహేశ్ బ్యాంక్పై సైబర్ దాడి కేసులో హైదరాబాద్ పోలీసులు పురోగతి సాధించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడారు. మహేశ్ బ్యాంక్ హ్యాకింగ్లో సైబర్ నేరగాళ్లు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని సీపీ తెలిపారు. బ్యాంక్ ఉద్యోగులకు రెండు ఫిషింగ్ మెయిల్స్ పంపించారు. ఆ ఫిషింగ్ మెయిల్స్ను బ్యాంకు ఉద్యోగులు క్లిక్ చేయడంతో, కంప్యూటర్ సిస్టంలతో హ్యాకర్లు అనుసంధానం అయ్యాయి. ఫైర్ వాల్స్ సరిగా లేకపోవడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ బ్యాంక్ సర్వర్లో లోపాలున్నాయి. ఈ లోపాలను ఆసరా చేసుకొని నగదు బదిలీ చేసుకున్నారు. సర్వర్ను పకడ్బందీగా నిర్వహించడంలో మహేశ్ బ్యాంక్ విఫలమైందన్నారు.
సైబర్ నేరగాళ్లు హ్యాకింగ్కు ముందే ఖాతాలు తెరిచారు. జనవరి 23న సర్వర్ హ్యాక్ చేసి 4 ఖాతాల్లోకి నగదు నిల్వలను పంపించారు. సదరు ఖాతాల నుంచి పలు బ్యాంకుల్లోని 115 ఖాతాలకు, వాటి నుంచి మరో 398 ఖాతాలకు నగదు బదిలీ చేశారు. సైబర్ నేరగాళ్లు ప్రాక్సీ ఐపీలు ఉపయోగించారని తెలిపారు. ఒక ఐపీ స్విట్జర్లాండ్, మరొకటి కెనడాలో చూపిస్తోందన్నారు. ఈ హ్యాకింగ్ కేసులో మొత్తం 23 మందిని అరెస్టు చేశామని, ఇందులో నలుగురు నైజీరియన్లు ఉన్నారని తెలిపారు. స్టీఫెన్ ఒర్జి ప్రధాన హ్యాకర్కు సహకరించాడని పేర్కొన్నారు. ప్రధాన హ్యాకర్లు నైజీరియాలో ఉన్నారు. ఇంటర్పోల్ను ఆశ్రయించి రెడ్ కార్నర్ నోటీసు జారీ చేస్తామన్నారు. బ్యాంకులు సైబర్ సెక్యూరిటీని నిర్లక్ష్యం చేయొద్దు. మహేశ్ బ్యాంకు కేసులో దర్యాప్తు కోసం రూ. 58 లక్షలు ఖర్చు చేశామని తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకు రూ. 3 కోట్లు రికవరీ చేశారు. ఈ ఏడాది జనవరి 23న మహేశ్ బ్యాంక్ సర్వర్ను నిందితులు హ్యాక్ చేసిన సంగతి తెలిసిందే.