హైదరాబాద్ : బక్రీద్ పర్వదినం దృష్ట్యా హైదరాబాద్ నగరంలో పశువుల అక్రమ రవాణాపై గట్టి నిఘా ఉంచాలని పోలీసులను నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశించారు. ఎక్కడికక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించాలన్నారు. ఆయా పోలీసు స్టేషన్లకు సంబంధించిన ఉన్నతాధికారులతో సీవీ ఆనంద్ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
పశువులను అక్రమంగా రవాణా చేసినా, వ్యాపారం చేసినా.. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఒక వేళ పశువులను తరలించాల్సి వస్తే అందుకు సంబంధించిన ఆధారాలను తప్పనిసరిగా డ్రైవర్లు, వ్యాపారులు చూపించాలన్నారు. లేని పక్షంలో వారిని అదుపులోకి తీసుకోవడం జరుగుతుందన్నారు. ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలో శాంతి కమిటీలు ఏర్పాటు చేసి, దాంట్లో యువతకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేలా చూడాలని సీవీ ఆనంద్ చెప్పారు. బక్రీద్, బోనాల పండుగల నేపథ్యంలో తెల్లవారుజామున 2 గంటల నుంచి 8 గంటల వరకు పోలీసులు నిఘా ఉంచి శాంతిభద్రతలను కాపాడాలన్నారు.