సిటీబ్యూరో, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో మతపరమైన స్నేహం, స్వీయ క్రమశిక్షణ, మత గురువులు, శాంతి కమిటీ సభ్యులు, నగర ప్రజల సహకారంతో అన్ని మతాల పండుగలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకున్నామని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ మేరకు ఆయన నగర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ ప్రజలు ఒకరి పండుగలను మరొకరు గౌరవించుకుంటూ ఐకమత్యతను చాటుతారని సీపీ కొనియాడారు.
సోషల్ మీడియా ద్వారా నెట్జన్ల నుంచి వస్తున్న ప్రశంసలు పోలీసులు, ప్రజలకు మధ్య ఉన్న సమన్వయానికి నిదర్శనంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. నగరంలో శాంతికి భంగం కలిగించే ఎన్నో ఘటనలు జరిగినా.. నగర ప్రజలు గంగా జమునా తహజీబ్ మాదిరిగా కలిసి మెలసి ఉన్నారని సీపీ పేర్కొన్నారు. హోంగార్డు నుంచి మొదలు అధికారులందరూ అహర్నిశలు శ్రమిస్తూ అంకితభావంతో పనిచేశారని సీపీ సిబ్బంది సేవలను కొనియాడారు. ట్రాఫిక్, ఎస్బీ, సోషల్ మీడియా, ఐటీ, టాస్క్ఫోర్స్ వంటి అన్ని విభాగాల సిబ్బంది కష్టపడి పనిచేశారని అభినందనలు తెలిపారు.