హైదరాబాద్ : హైదరాబాద్ కేంద్రంగా జరిగిన రూ. 903 కోట్ల కుంభకోణాన్ని హైదరాబాద్ పోలీసులు బట్టబయటలు చేశారు. ఇంత భారీ స్థాయిలో కుంభకోణం జరిగినప్పటికీ కేంద్ర నిఘాలు సంస్థలు పసిగట్ట లేకపోయాయి. కానీ ఈ కుంభకోణాన్ని హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా కుంభకోణం వివరాలను హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ మీడియాకు వెల్లడించారు.
పెట్టుబడుల పేరుతో రూ. 903 కోట్లు మోసం చేసి, ఆ డబ్బును హవాల ద్వారా విదేశాలకు తరలిస్తున్న అంతర్జాతీయ ముఠాను హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు. అరెస్టు అయినా వారిలో ఒకరు తైవాన్, మరొకరు చైనీయుడు ఉండగా, మిగతా వారు భారతీయులని స్పష్టం చేశారు. చైనా దేశస్థుడిని ఐబీ డిటెన్షన్ సెంటర్లో అదుపులోకి తీసుకున్నారు. కంబోడియా దేశం అడ్డాగా భారతీయులకు కమీషన్ ఆశ చూపి కొందరు చైనీయులు భారతదేశంలో రహస్యంగా తమ నెట్వర్క్ను నిర్వహిస్తూ భారీ ఎత్తున మన దేశ సంపదను కొల్లగొడుతున్నారని పేర్కొన్నారు.
దేశంలోనే మొట్టమొదటి సారిగా అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న భారీ మోసాన్ని తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ పోలీసులు ఛేదించారని ఆయన వెల్లడించారు. విదేశీ మారక ద్రవ్య నిర్వాహణ చట్టాన్ని (ఫెమా) నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించి భారీ ఎత్తున్న జరుగుతున్న ఈ స్కాంపై ఇప్పటి వరకు కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, డీఆర్ఐలు పట్టుకోలేదన్నారు. భవిష్యత్తులో కేంద్ర దర్యాప్తు సంస్థలను ఈ దర్యాప్తులో భాగస్వాములు చేస్తామని సీపీ వివరించారు. దేశ ఆర్ధిక వ్యవస్థను చిన్నా భిన్నం చేస్తూ దేశ వ్యాప్తంగా రూ. 50 వేల కోట్ల వరకు చైనీయులు మన దేశ సంపదను దొచుకెళ్లి ఉంటారని అనుమానాలున్నాయన్నారు. హైదరాబాద్ పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో రూ. 903 కోట్లు, ఆర్బీఐ నుంచి అనుమంతి పొందిన రెండు ఫారెన్ మనీ ఎక్ఛేంజ్ల ద్వారా హవాల జరిగినట్లు వెల్లడయ్యిందన్నారు.
ఈ కేసులో లోతైన దర్యాప్తు జరుపుతున్నామని, విదేశాలతో కూడా ఈ కేసు ముడిపడి ఉందన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థల భాగస్వామ్యం చేస్తామన్నారు. ఈ కేసులో రూ.1.91 కోట్లు ఫ్రీజ్ చేశామని వెల్లడించారు. ఈ సమావేశంలో నగర అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్, సీసీఎస్ జాయింట్ సీపీ గజారావు భూపాల్, సైబర్క్రైమ్స్ ఏసీపీ కేవీఎం ప్రసాద్, ఇన్స్పెక్టర్ గంగాధర్ బృందం పాల్గొన్నారు.