చార్మినార్, ఫిబ్రవరి 3: క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న ముఠా సభ్యులను దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దక్షిణ మండల టాస్క్ఫోర్స్ డీసీపీ గుమ్మీ చక్రవర్తి తెలిపిన వివరాల ప్రకారం.. బర్కత్పుర ప్రాంతానికి చెందిన వికాస్ అగర్వాల్ (40) గతంలో గుర్రపు పందాలను నిర్వహించే వాడు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో ఆన్లైన్ అప్లికేషన్ల ద్వారా క్రికెట్ బెట్టింగ్లు నిర్వహిస్తూ సులువుగా డబ్బు సంపాదించాలని ప్లాన్ వేసుకున్నాడు. ముంబాయి కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న సాగర్ను సంప్రదించి అతడితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. బెట్టింగ్ల కోసం వికాస్ అగర్వాల్ గోషామహల్ ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని బెట్టింగ్లకు పాల్పడుతున్నాడు.
విశ్వసనీయ సమాచారం మేరకు దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు ఇంటిపై దాడి జరిపి వికాస్ అగర్వాల్తోపాటు క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న గుజరాత్ రాష్ర్టానికి చెందిన మహేంద్ర పటేల్ (36), రాజేంద్రపటేల్ (36)లను అదుపులోకి తీసుకున్నారు. మరో ఏడుగురు పరారీలోఉన్నారు. నిందితుల వద్ద నుంచి రూ.12లక్షల 5 వేల నగదుతోపాటు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్రతోపాటు ఎస్సైలు శ్రీశైలం, నరేందర్, షేక్ బురాన్, నర్సింహులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. తదుపరి విచారణ నిమిత్తం షాహినాయత్గంజ్ పోలీసులకు అప్పగించామని తెలిపారు.