జాతీయ గ్రేడ్-ఏ ఆఫీస్ స్పేస్లో నగరానికి 25 శాతం భాగస్వామ్యం
తెలంగాణ ప్రభుత్వ విధానాలతో ఆఫీస్ స్పేస్ మార్కెట్లో గణనీయ వృద్ధి
ప్రధానంగా హైటెక్ సిటీ, గచ్చిబౌలిలోనే 96 శాతం మార్కెట్
2022 చివరి నాటికి వంద మిలియన్ చదరపు అడుగల మార్కెట్గా అవతరణ
గ్రేడ్-ఏ ఆఫీస్ స్పేస్… అంటే కార్పొరేట్ సంస్థల కార్యాలయాలకు వేదిక. ఇలాంటి ఆఫీస్ స్పేస్ మార్కెట్లో హైదరాబాద్ నగరం దూసుకుపోతున్నది. దేశంలోని ఇతర మెట్రో నగరాల్లో కంటే గణనీయమైన వృద్ధిని నమోదు చేస్తున్నది. ఈ క్రమంలో ప్రస్తుతం 90.4 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్తో ఉన్న హైదరాబాద్… 2022 ముగింపు నాటికి వంద మిలియన్ చదరపు అడుగుల మైలురాయిని దాటనుంది. ఈ మేరకు జేఎల్ఎల్ సంస్థ నిర్వహించిన సర్వేలో ఇలాంటి పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.
– సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మార్చి 29 (నమస్తే తెలంగాణ)
కొన్ని సంవత్సరాలుగా గ్రేడ్-ఏ ఆఫీస్ స్పేస్ మార్కెట్లో హైదరాబాద్ నగరం మెరుగైన స్థానాన్ని నమోదు చేస్తున్నది. 2016 నుంచి 2021 వరకు పరిశీలిస్తే… ఏకంగా 81 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం. దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే ఇదెంతో మెరుగైన స్థానంగా మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. హైదరాబాద్ తర్వాత రెండో స్థానంలో ఉన్న బెంగళూరు ఈ ఆరేండ్లలో 47 శాతం వృద్ధిని మాత్రమే నమోదు చేసింది. కాగా దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లోని గ్రేడ్-ఏ ఆఫీస్ స్పేస్ మార్కెట్ విభాగంలో హైదరాబాద్ నగర భాగస్వామ్యం ఇటీవలి వరకు 12.7 శాతంగా ఉండగా… కొత్తగా అందుబాటులోకి వచ్చిన స్పేస్తో భాగస్వామ్యం 25 శాతానికి పెరిగింది. దీనికి ప్రధాన కారణం… తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలతో పాటు గ్రిడ్ పాలసీ అమలులో భాగంగా ఇస్తున్న ప్రోత్సాహకాలు అని జేఎల్ఎల్ తన నివేదికలో స్పష్టం చేసింది.
ఆ రెండు కారిడార్లలోనే…
హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ మార్కెట్ అనేది కేవలం రెండు ప్రధాన కారిడార్లలోనే కేంద్రీకృతమై ఉందని జేఎల్ఎల్ నివేదికలో పేర్కొన్నారు. హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాలు గ్రేడ్-ఏ ఆఫీస్ స్పేస్ మార్కెట్కు ఇంజిన్లుగా పని చేస్తున్నాయని, 96 శాతం ఇక్కడ నుంచే మార్కెట్ కొనసాగుతున్నదని జేఎల్ఎల్ తెలంగాణ, ఏపీ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ పట్నాయక్ తెలిపారు.
గ్రిడ్ పాలసీ అమలుతో…
తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అమలు చేస్తున్న విధానాలతో ఐటీ వృద్ధి అనేది నగరం నలువైపులా విస్తరిస్తున్నదని, ఈ క్రమంలో గ్రిడ్ పాలసీతో తూర్పు వైపున ఉప్పల్, ఉత్తరాన శంషాబాద్ వైపు ప్రాంతాలకు విస్తరిస్తున్నదని సందీప్ పట్నాయక్ అన్నారు. గ్రిడ్ పాలసీలో భాగంగా ఔటర్ రింగు రోడ్డు లోపలి వైపున ఉన్న 11 ఇండస్ట్రియల్ పార్కులను ఐటీ పార్కులుగా మార్చింది. అదేవిధంగా ఉత్తరాన కొంపల్లిలో ఐటీ టవర్స్, నార్త్-వెస్టర్న్ వైపున కొల్లూరులో ఐటీ పార్కు నిర్మాణాన్ని చేపడుతుంది. గ్రిడ్ పాలసీలో భాగంగా డెవలపర్లకు ప్రభుత్వం ప్రోత్సాహకాలను కూడా అమలు చేస్తుంది. మూడు సంవత్సరాల వ్యవధిలో 500 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉపాధి కల్పిస్తునన ఐటీ, ఐటీఈఎస్ యూనిట్లకు యాంకర్ యూనిట్ ప్రోత్సాహకాలను అందిస్తుంది. ఇందులో సంబంధిత భూమిని 50 శాతం ఐటీ, ఐటీఈఎస్ ప్రయోజనాల కోసం వినియోగించగా… మిగిలిన సగంలో నివాస, వాణిజ్య ప్రయోజనాలకు వినియోగించవచ్చుననే వెసులుబాటు కూడా కల్పించింది.