సిటీబ్యూరో, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ అంటే టక్కున గుర్తుకు వచ్చేది చార్మినార్. ఒక విధంగా నగరానికి పర్యాయ పదంగా మారిందని చెప్పవచ్చు. నగరవాసులతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన వారు చార్మినార్ను సందర్శించకుండా తిరిగి వెళ్లరు. అంతేకాదు విదేశీయాత్రికులు కూడా హైదరాబాద్కు వస్తే చారిత్రక కట్టడాన్ని చూడకుండా ఉండలేరు. అంతటి అద్భుత కట్టడం ‘చార్ సౌ చాలీస్ సాల్’ దాటినా చెక్కు చెదరలేదు. 4 శతాబ్దాలుగా ఎంతోమంది పర్యాటకులను ఆకట్టుకున్నది. చిన్నారులు చార్మినార్ను చూద్దామని మారం చేసిన సందర్భాలు అనేకం.
1592లో నాలుగు దిక్కుల నాలుగు మినార్లు
హిజ్రీ క్యాలెండర్ ప్రకారం 01.01.1000 సంవత్సరంలో చార్మినార్కు మొహర్రం మొదటి రోజున పునాది పడిందని చెబుతుంటారు. ఆ ప్రకారం ఈ చారిత్రక కట్టడం నేటికి 444 ఏండ్లు పూర్తి చేసుకున్నట్లు హిజ్రీ క్యాలెండర్ ద్వారా తెలుస్తున్నది.
150 ఏండ్ల పురాతన గడియారాలు
చార్మినార్ను భాగ్యనగరం నడిబొడ్డున నిర్మించడంతో నగరవాసులు విరివిగా సందర్శించేవారు. ఈ స్మారక చిహ్నం నాలుగు వైపులా ఉన్న గడియారాలను 1889లో లండన్ నుంచి తీసుకువచ్చారు. ఈ 150 ఏండ్ల పురాతన గడియారాలు నిజాం పాలకుడైన మీర్ మహబూబ్ అలీఖాన్ పాలనలో నగరానికి చేరుకున్నాయని చరిత్ర తెలుపుతున్నది. నగరంలో నిర్మించిన మొట్టమొదటి బహుళ అంతస్తుల భవనం చార్మినారే కావడం చెప్పుకోదగిన విషయం. ఇలాంటి వారసత్వ చారిత్రక కట్టడాల పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం నిర్విరామంగా కృషిచేస్తున్నది.