చార్మినార్, మే 9 : 194 ఏండ్ల చరిత్ర ఉన్న కొత్వాల్ భవనానికి మెరుగులద్ది మరింత సుందరంగా మలిచేందుకు కృషి చేస్తున్నామని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. మంగళవారం పాతనగరంలోని చారిత్రక కొత్వాల్ భవనం, సౌత్జోన్ డీసీపీ కార్యాలయానికి చేపడుతున్న మరమ్మతు పనులను ఆయన ఇతర అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ పురానీహవేలీలోని వింటేజ్ కొత్వాల్ భవనాన్ని 1829లో నిజాం పరిపాలనలో అందుబాటులోకి తీసుకురాగా 1920 నుంచి నిజాం పాలనలోనూ నాటి కొత్వాల్ కోసం వినియోగించారని చెప్పారు.
అప్పటినుంచి 2001 వరకు నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం ఇక్కడే కొనసాగిందని, అనంతరం బషీర్బాగ్లోని నూతన భవనానికి కమిషనర్ కార్యాలయం తరలి వెళ్లిందన్నారు. దక్షిణ మండల డీసీపీ కార్యకలాపాలన్నీ ఇప్పటికీ ఈ భవనంలోనే నిర్వహిస్తున్నామని తెలిపారు. పురాతన భవన నిర్మాణం అక్కడక్కడ పెచ్చులూడుతుండటంతో ఈ భవనాన్ని పునరుద్ధరిస్తున్నామని చెప్పారు. వచ్చే ఆరు నెలల వ్యవధిలో మరమ్మతులు పూరిచేసి కొత్వాల్ భవనానికి నూతన శోభ అందించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దక్కన్ టెర్రయిన్ సంస్థ ఎండీ మీర్ బర్కతుల్లా ఖాన్, అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్, దక్షిణ మండల డీసీపీ సాయిచైతన్య, టాస్క్ఫోర్స్ డీసీపీ చక్రవర్తి గుమ్మీ, అదనపు డీసీపీ ఆనంద్, చార్మినార్, మీర్చౌక్, ఫలక్నుమా ఏసీపీలు రుద్రభాస్కర్, దామోదర్రెడ్డి, షేక్ జహంగీర్లతోపాటు దక్షిణ మండల పోలీస్ ఇన్స్పెక్టర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.