పర్యావరణహితమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపడుతున్నది. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రజా సంక్షేమానికి వినియోగిస్తూ ప్రజారోగ్యానికి బాటలు వేస్తున్నది. ఇప్పుడు మరో సరికొత్త ప్రయోగంతో ముందుకొస్తున్నది. ప్రపంచ ఔషధ నగరిగా పేరుగాంచిన హైదరాబాద్ కేంద్రంగా.. నూతన ఆవిష్కరణలకు పూనుకున్నది. గుడిమల్కాపూర్ కూరగాయల మార్కెట్లో కూరగాయల వ్యర్థాలతో బయోగ్యాస్ ఇంధనాన్ని ఉత్పత్తి చేసేందుకు చర్యలు చేపట్టింది. దీనికి కోసం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సంస్థ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి మరో కీలక పరిశోధనలకు సిద్ధమైంది. దీంతో ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా.. ఇటు స్థానికంగా వ్యర్థాల తరలింపు, నిర్వహణ భారం తగ్గనుండగా.. ఇదే సమయంలో అదనంగా స్థానిక అవసరాలు తీరేలా బయోగ్యాస్ ఉత్పత్తి చేసే సువర్ణావకాశముంది.
సిటీబ్యూరో, నవంబర్ 27(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ కేంద్రంగా కెమికల్ రంగంలో నూతన ఆవిష్కరణలకు ఊతమిస్తున్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సంస్థ మరో కీలక పరిశోధన కోసం ముందడుగేసింది. ఇప్పటికే క్యాన్సర్లాంటి ప్రాణాంతక వ్యాధుల నివారణకు వినియోగించే మందుల తయారీకి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని గుజరాత్కు చెందిన ఫార్మా కంపెనీకి అందించగా..తాజాగా కూరగాయల వ్యర్థాలతో బయోగ్యాస్ ఇంధనాన్ని ఉత్పత్తి చేసేందుకు చర్యలు చేపట్టింది.
దీనికోసం నగరంలోని గుడిమల్కాపూర్ కూరగాయల మార్కెట్లో ఏర్పాటు చేసే బయోగ్యాస్ ప్లాంట్కు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించింది. త్వరలో ఈ ప్లాంట్ అందుబాటులోకి రానుండగా, నిత్యం ఉత్పత్తి అవుతున్న 5టన్నుల కూరగాయల వ్యర్థాలు ఇంధనంగా మారనున్నాయి. దీంతో స్థానికంగా వ్యర్థాల తరలింపు, నిర్వహణ భారం తగ్గనుంది. అదే విధంగా అదనంగా స్థానిక అవసరాలు తీరేలా బయోగ్యాస్ ఉత్పత్తి చేసే వీలు కలగనుంది. ఇప్పటికే సిటీలోని ప్రధాన మార్కెట్లలో బయోగ్యాస్ ప్లాంట్లను తెలంగాణ అగ్రికల్చర్ శాఖ ఏర్పాటు చేయగా.. తాజాగా గుడిమల్కాపూర్ బయోగ్యాస్ ప్లాంట్కు ఐఐసీటీ రూపొందించిన టెక్నాలజీని వినియోగించనుంది.
నిత్యం వేల టన్నుల కూరగాయలు వచ్చే మార్కెట్లలో గుడిమల్కాపూర్ ఒకటి. కూరగాయలతోపాటు పండ్లు, పూల విక్రయాలకు ఈ మార్కెట్ కీలకమైంది. రోజు దాదాపు 5టన్నులకు పైగా కూరగాయల వ్యర్థాలు ఉత్పత్తి అవుతుండగా వీటి తరలింపు తలకు మించిన భారంగా మారుతున్నది. అయితే వ్యర్థాలను ఇంధన వనరులుగా మార్చాలనే లక్ష్యంతో తెలంగాణ అగ్రికల్చర్ శాఖ మార్కెట్ యార్డులలో బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నది. సిటీలో ఇప్పటివరకు ఎర్రగడ్డ, బాటసింగారం, కూకట్ పల్లి మార్కెట్లలో రోజుకు 500కిలోల బయోగ్యాస్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న మూడు ప్లాంట్లను ఏర్పాటు చేసింది. తాజాగా గుడిమల్కాపూర్ మార్కెట్లోనూ అందుబాటులోకి వచ్చే ప్లాంటుతో కూరగాయల వ్యర్థాల నిర్వహణ వ్యయం తగ్గి అదనంగా ఉత్పత్తి అయ్యే బయోగ్యాస్తో స్థానిక అవసరాలకు వాడుకునే అవకాశం వచ్చింది.
కేంద్ర బయోటెక్నాలజీ సంస్థ, తెలంగాణ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో తొలి బయో గ్యాస్ ప్లాంట్ను హైదరాబాద్లోని ఓల్డ్ బోయిన్ పల్లి మార్కెట్లో రెండేండ్ల క్రితమే ఏర్పాటు చేశారు. రోజుకు 10టన్నుల వ్యర్థాలను పునర్వినియోగించాలనే లక్ష్యంతో దాదాపు రూ. 5 కోట్లతో ప్లాంటును అందుబాటులోకి తీసుకురాగా 20 నెలల కాల వ్యవధిలో 3,664 టన్నుల వ్యర్థాలను శుద్ధి చేశారు. దీంతో ఉత్పత్తి అయిన 1,27,228 లక్షల క్యూబిక్ మీటర్ల బయోగ్యాస్తో ఏకంగా 75,703 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడంతోపాటు అదనంగా 1152 కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లకు సరిపడా బయోగ్యాస్ను స్థానిక అవసరాలకు వినియోగించారు. వృథాగా పోతున్న కూరగాయల వ్యర్థాలను సమర్థవంతంగా వినియోగంలోకి తీసుకురావడంతో నెలకు దాదాపు రూ. 5లక్షల వరకు వ్యర్థాల నిర్వహణ, కరెంట్ చార్జీలు కూడా ఆదా అవుతున్నాయి. ఇదే తరహాలో నగరంలోని ప్రధాన మార్కెట్లలో బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తుండగా.. కొత్తగా గుడిమల్కాపూర్ కూరగాయల మార్కెట్లో అందుబాటులోకి రానుంది.
గుడిమల్కాపూర్ మార్కెట్లో నిత్యం 5-7టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నట్లుగా తెలిసింది. బయోగ్యాస్ ప్లాంటును ఏర్పాటు చేస్తుండటంతో నెలకు రూ. 2లక్షల వరకు ఆదాయం సమకూరుతుందని అంచనా. దీంతోపాటు బయోఫర్టిలైజ్ను ఉత్పత్తి చేసే వీలు ఉంటుందని తెలిసింది. ప్రస్తుతం రసాయన రహిత కూరగాయలకు మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఉత్పత్తి చేసిన బయోమన్యూర్తో ఎరువుల వినియోగం కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అధిక గాఢత కలిగిన బయో మిథేన్తో విద్యుత్ ఉత్పత్తి చేసే వీలు ఉండగా, బయోగ్యాస్తో వంట అవసరాలకు వినియోగించుకోవచ్చని, మార్కెట్ పరిధిలో విద్యుత్ అవసరాలు కూడా తీరుతాయని భావిస్తున్నారు.
ఆధునిక టెక్నాలజీతో జీవ ఇంధనం
వ్యర్థాల నుంచి జీవ ఇంధన ఉత్పత్తికి ఐఐసీటీ ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నది. ఇంధన వనరులను సంరక్షించుకునే క్రమంలో వ్యర్థాల నుంచి ఇంధనం సృష్టించేందుకు ప్లాంట్లను ఏర్పాటు చేసింది. బయోమన్యూర్తోపాటు, ఇంధనం కూడా ఉత్పత్తి చేసేందుకు ఐఐసీటీకి చెందిన అధిక గాఢత కలిగిన బయో మిథేనేషన్ టెక్నాలజీ ఆధారంగా పనిచేసే అనియోరోబిక్ గ్యాస్ లిఫ్ట్ రియాక్టర్ ప్లాంటును అందుబాటులోకి తీసుకురానున్నారు. దీని సాయంతో కూరగాయల వ్యర్థాలను సమర్థవంతంగా ట్రీట్ చేసి మిథేన్ అధికంగా ఉండే బయోగ్యాస్, పోషకాలు ఎక్కువగా ఉండే బయోమన్యూర్ (ఆర్గానిక్ ఎరువు)లను ఉత్పత్తి చేసేందుకు వీలు ఉంటుందని ఐఐసీటీ ఉన్నత వర్గాలు తెలిపాయి.