Hyderabad | బంజారా హిల్స్, మార్చి 5: హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 1లో తాజ్ బంజారా చెరువు వద్ద పార్క్లో అక్రమంగా ప్రవేశించడమే కాకుండా, అక్రమ డంపింగ్ చేస్తున్న వ్యక్తుల మీద బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. కొంతమంది ప్రైవేటు వ్యక్తులు లారీలు ద్వారా మట్టిని డంపింగ్ చేస్తున్నారని మంగళవారం రాత్రి సమాచారం అందుకున్న నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి బంజారాహిల్స్ పోలీసులకు, జోనల్ కమిషనర్కు సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న బంజారాహిల్స్ పోలీసులు డంపింగ్ చేస్తున్న రెండు టిప్పర్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ప్రధాన రోడ్డు మీద జీహెచ్ఎంసీ పార్క్ గేట్ నుంచి అక్రమంగా లోపలకి వెళ్లి ప్రైవేటు వ్యక్తులు డంపింగ్ చేస్తున్నారని టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుల మీద బీఎన్ఎస్ 324(3), 329(3) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా అక్రమ డంపింగ్లకు సహకారం అందిస్తున్న వారు ఎవరనే అంశంపై విచారణ చేపట్టాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జోనల్ కమిషనర్ను ఆదేశించారు.