మన్సూరాబాద్, సెప్టెంబర్ 9 : రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని అతి వేగంతో వచ్చిన బైకు ఢీకొట్టింది. తీవ్ర గాయలపాలైన వ్యక్తిని దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..హరిపురికాలనీలో కీసమల్ల రాములు (48) తన కుటుంబసభ్యులతో కలిసి ఉంటున్నాడు. వృత్తి రీత్యా కూలీ పని చేస్తుంటాడు.
పని నిమిత్తం గురువారం ఇంటి నుంచి బయలుదేరాడు. వైట్ హౌజ్ వద్ద నుంచి ఎన్టీఆర్నగర్ వైపుకు రోడ్డు దాటుతుండగా దిల్సుఖ్నగర్ నుంచి ఎల్బీనగర్ వైపుకు వెళ్తున్న బైకు (టీఎస్10 ఈజీ5074) అతివేగంతో వచ్చి రాములును ఢీకొట్టింది. తలకు తీవ్రగాయమై అపస్మారక స్థితిలో పడి ఉన్న రాములును చికిత్స నిమిత్తం సమీపంలోని ఓజోన్ దవాఖానకు తరలించారు. రాములును పరిశీలించిన డాక్టర్లు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు.
మృతుడి కుమారుడు కీసమల్ల నరేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు.