Hyderabad | హైదరాబాద్ : చావు ఎవర్ని ఎప్పుడు పలుకరిస్తుందో తెలియదు.. మొన్న ఓ కానిస్టేబుల్ జిమ్ వర్కవుట్ చేస్తూ కుప్పకూలిపోగా, నిన్న ఓ యువకుడు డ్యాన్స్ చేస్తూ ప్రాణాలు వదిలాడు. తాజాగా మరో యువకుడు బ్యాడ్మింటన్( Badminton ) ఆడుతూ స్టేడియంలోనే కుప్పకూలిపోయాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్ లాలాపేటలోని ప్రొఫెసర్ జయశంకర్ ఇండోర్ స్టేడియంలో మంగళవారం రాత్రి చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. మల్కాజ్గిరికి చెందిన పరమేశ్ యాదవ్ ఓ ప్రయివేటు ఉద్యోగి. అయితే తన విధులను ముగించుకున్న అనంతరం మంగళవారం రాత్రి బ్యాడ్మింటన్ ఆడేందుకు లాలాపేటలోని ఇండోర్ స్టేడియం వచ్చాడు. తన స్నేహితులతో కలిసి బ్యాడ్మింటన్ ఆడుతుండగా, ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పాడు. క్షణాల్లోనే స్టేడియంలోనే కుప్పకూలిపోయాడు. అప్రమత్తమైన స్నేహితులు.. పరమేశ్ను సమీప ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. గుండెపోటు( Cardiac Arrest ) కారణంగానే పరమేశ్ మృతి చెందినట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు.
మృతుడు పరమేశ్కు భార్య, పిల్లలు ఉన్నారు. పరమేశ్ మృతితో ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న లాలాగూడ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.