Hyderabad | హైదరాబాద్లోని నల్లకుంటలో దారుణం జరిగింది. అనుమానంతో భార్యపై ఓ భర్త పెట్రోలు పోసి నిప్పంటించాడు. అడ్డుకునేందుకు వచ్చిన కూతుర్ని కూడా మంటల్లోకి తోసేశాడు.
వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ జిల్లా హుజూరాబాద్కు చెందిన వెంకటేశ్, త్రివేణి కొన్నేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. జీవనోపాధి కోసం హైదరాబాద్కు వచ్చి తిలక్నగర్ బస్తీలో కిరాయి రూంలో ఉంటున్నారు. వీరికి ఒక పాప, ఒక బాబు ఉన్నారు. వెంకటేశ్ సెంట్రింగ్ పనిచేస్తుంటాడు. త్రివేణి హోటల్లో పనిచేస్తుంది. పని నుంచి ఇంటికి ఏ కొంచెం ఆలస్యమైనా అనుమానంతో వేధించేవాడు. భర్త వేధింపులు తాళలేక కొద్దిరోజుల క్రితం త్రివేణి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో తాను మారతానని నమ్మబలికి త్రివేణిని వెంకటేశ్ హైదరాబాద్ తీసుకొచ్చాడు.
హైదరాబాద్ వచ్చిన తర్వాత వెంకటేశ్ మళ్లీ మొదటికొచ్చాడు. ఇద్దరి మధ్య కలహాలు పెరగడంతో ఆగ్రహానికి లోనైన వెంకటేశ్.. త్రివేణిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. మంగళవారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో భార్య త్రివేణి, కొడుకు ఇద్దరు ఒకే మంచంపై నిద్రపోతుండగా.. కూతురు కింద పడుకుని ఉంది. ఆ సమయంలో మెల్లగా తన కొడుకును బయటకు తీసుకొచ్చి సమోసా తినిపించి బయటే ఉంచాడు. అప్పటికే తెచ్చుకున్న పెట్రోలును మంచంపై నిద్రపోతున్న భార్య త్రివేణిపై పోసి నిప్పటించాడు. చెలరేగిన మంటల సెగ తగిలి కింద పడుకున్న కూతురుకు తగిలి వెంటనే బయటకు పరిగెత్తుకుంటూ వచ్చింది. ఇది గమనించిన చుట్టుపక్కల వాళ్లు అక్కడకు వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు త్రివేణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి అప్పలయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్, మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుడి కదలికలను ట్రాక్ చేసి అరెస్టు చేశారు.