Secunderabad | బేగంపేట్, ఫిబ్రవరి 9: సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. భార్యతో గొడవపడి కోపంతో భర్త ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. మార్కెట్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సికింద్రాబాద్ ప్యాట్నీలో ఉన్న కామాక్షి సిలక్స్ షాప్ లోనే భర్త నిప్పు పెట్టుకున్నాడు. భార్య మౌనిక షాప్ లో పని చేస్తుండగా, భార్యతో గొడవపడి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. దీంతో శ్రవణ్ తీవ్రంగా గాయపడ్డాడు.
సమాచారం అందుకున్న మార్కెట్ పోలీసులు షాప్ దగ్గరికి చేరుకున్నారు. తీవ్రంగా కాలిన గాయాలున్న శ్రవణ్ ను హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. దుకాణంలో వినియోగదారులు ఉండగానే ఘటన జరగడంతో అందరూ ఒక్కసారిగా పరుగులు తీశారు. ఆత్మహత్యాయత్న ఘటనలో గాయపడిన శ్రవణ్ ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఘటనా స్థలికే చేరుకున్న మహంకాళి ఏసీపీ సర్దార్ సింగ్ మార్కెటింగ్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర ఘటన జరిగిన తీరును తెలుసుకున్నారు. దుకాణంలో ఒక్కసారిగా దట్టమైన పొగలు కమ్ముకోవడంతో వినియోగదారులు ఉక్కిరి బిక్కిరయ్యారు. అప్పటికే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది దుకాణంలో చెలరేగిన మంటలను పొగలను అదుపులోకి తీసుకువచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భార్యాభర్తల మధ్య జరిగిన ఘర్షణ ఎందుకు జరిగిందనే విషయాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.