బేగంపేట్, జూన్ 6 : తెలంగాణ స్వచ్ఛ ఆటో టిప్పర్, రిక్షా కార్మికుల యూనియన్ సంయుక్తంగా మంగళవారం నెక్లెస్ రోడ్డులో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సికింద్రాబాద్, బేగంపేట్ సర్కిళ్ల గౌరవ అధ్యక్షులు హంసరాజు, పరశురాంల ఆధ్వర్యంలో 500 స్వచ్ఛ ఆటో టిప్పర్ వాహనాలతో నెక్లెస్ రోడ్డులోని అంబేద్కర్నగర్ డంపింగ్ యార్డ్ నుంచి జలవిహార్ వరకు ర్యాలీ నిర్వహించారు. అంతకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. లాంగ్ లివ్ కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కలమడుగు రాజేందర్ మాట్లాడుతూ ఇంటింటి చెత్త సేకరించే కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపడానికి స్వచ్ఛ ఆటో టిప్పర్ వాహనాలను కార్మికులకు అందించారని అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 4500 వాహనాలను అందజేశారని, దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హంసరాజు, జీహెచ్ఎంసీ అధ్యక్షుడు గోపాల్నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ అర్జున్, కోశాధికారి పరశురాం, శివ, పుల్లయ్య, వెంకటేశ్, మల్లిఖార్జున్తో పాటు పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు.