సిటీబ్యూరో/ కవాడిగూడ, ఫిబ్రవరి 14 ( నమస్తే తెలంగాణ ) : ఎన్టీఆర్ స్టేడియంలో కొలువుదీరిన బుక్ఫెయిర్ ఈనెల 19తో ముగియనున్నది. మరో నాలుగు రోజులు మాత్రమే ఉండటంతో బుధవారం సందర్శకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కాగా, తంగేడుకుంట హెబ్బర్ నాగేశ్వరరావు రచించిన ‘విద్యకు విముక్తి’ పుస్తక ఆవిష్కరణ రవ్వా శ్రీహరి వేదికపై జరిగింది.
ముఖ్య అతిథిగా డాక్టర్ చమర్తి ఉమామహేశ్వర రావు, బొప్ప భాస్కర్ పాల్గొన్నారు. అమృత రాజ్ రచించిన పిలుపు పుస్తక పరిచయ కార్యక్రమం జరిగింది. ఈ పుస్తకాన్నీ కేంద్ర సాహిత్య యువ పురస్కార గ్రహీత డాక్టర్ పసునూరి రవీందర్ ఆవిష్కరించారు. ప్రముఖ రచయిత ఓల్గా అనువాదం చేసిన ‘హమీద్ దల్వాయ్’ కథల పుస్తకాన్నీ ఉనుదూర్తి సుధాకర్ ఆవిష్కరించారు. శాస్త్రీయమైన స్వార్థ్యకారక దివ్యసంకల్పాలు’ పుస్తకాన్ని స్వామి ప్రజ్ఞానంద ఆవిష్కరించారు.
రవ్వా శ్రీహరి వేదికపై హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ అధ్యక్షతన జరిగిన పగిడిపాల ఆంజనేయులు రాసిన ‘హృదయ రాగం’ పుస్తకాన్ని ప్రముఖ సినీ దర్శకుడు నర్సింగ్ రావు ఆవిష్కరించారు. రవ్వా శ్రీహరి వేదికపై కే. ఆనందచారి అధ్యక్షతన ‘నేటి సామాజిక పరిణామం-రచయితల స్పందన’పై సెమినార్ జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ సాహితీ విమర్శకులు గుంటూరు లక్ష్మీ నర్సయ్య ,రచయితలు ఎన్ వేణుగోపాల్, జూపాక సుభద్ర, బుక్ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు.