నిరసనలతో హోరెత్తిన బాలాపూర్ చౌరస్తా
గ్యాస్ ధరలు తగ్గించాలంటూ కదం తొక్కి న జనం
మండుటెండను సైతం లెక్క చేయని మహిళలు
బడంగ్పేట/ఆర్కేపురం/కందుకూరు, మే15: కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరను తగ్గించాలని బాలాపూర్ చౌరస్తాలో చేపట్టిన మహాధర్నా జన సంద్రంగా మారింది. మహిళలు పెద్ద సంఖ్యలో కదం తొక్కారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ బాలాపూర్ చౌరస్తా వరకు నిర్వహించిన పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు. బాలాపూర్ చౌరస్తా గులాబీ మయంగా మారింది. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, జడ్పీచైర్పర్సన్ తీగల అనితారెడ్డి, గ్రంథాలయాల చైర్మన్లు శ్రీధర్, కప్పాటి పాండు రంగారెడ్డి, పి.కార్తిక్రెడ్డి, కౌసిక్రెడ్డి, మేయర్లు చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, దుర్గా దీప్లాల్చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, ఎంపీపీ రఘుమారెడ్డి, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు పూల మాల వేసి పాదయాత్రగా బయలు దేరారు.
మండే ఎండను సైతం లెక్క చేయకుండా చంటి బిడ్డలను ఎత్తుకొని ముస్లిం మహిళలు మహాధర్నాలో పెద్ద ఎత్తున్న పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తు నినాదాలు చేశారు. మోడీ.. ‘గ్యాస్ పొయ్యి తీసుకుపో.. కట్టెల పొయ్యి ఇచ్చిపో’ అంటూ నినాదాలు చేశారు. నల్లబెలూన్స్తో నిరసన తెలుపుతూ గాలిలోకి ఎగురవేశారు. ఖాళీ గ్యాస్ సిలిండర్లతో ప్రదర్శన చేశారు. మంత్రి కట్టెల పొయ్యిపై వంట చేశారు. కట్టెల పొయ్యితో మహిళలకు ఉన్న ఇబ్బందులను వారు వివరించారు. మహిళలతో పెట్టుకున్న వారు చరిత్రలో ఎవరూ బతికి బట్టకట్టలేదని శాపనార్థాలు పెట్టారు. కళాకారులు పాటల రూపంలో బీజేపీని కడిగేశారు. ధూం ధాం.. పాటలతో ఉత్తేజపరిచారు. దారిపొడువునా గులాబీ జెండాలు, కటౌట్లు, ఫ్లెక్సీలు, గులాబీ తోరణాలు దర్శనమిచ్చాయి. ప్రజల సమస్యలను గాలికి వదిలి అధికారం ఇవ్వాలని బీజేపీ నాయకులు ప్లీజ్ ప్లీజ్.. అంటూ మోకరిల్లడం పట్ల శేమ్ శేమ్.. అంటూ ధర్నాలో నినాదాలు చేశారు. బీజేపీ నాయకులు పైసలివ్వరు.. పనిచేయరు.. తప్పుడు ప్రచారం చేస్తారని నినాదాలు చేశారు. ఈ ధర్నా మహేశ్వరం మండల అధ్యక్షుడు రఘుమారెడ్డి, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మహేశ్వరం నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బేర బాలకిషన్, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామిడి రాంరెడ్డి, కామేశ్ రెడ్డి, నాగేశ్, మహేందర్ రెడ్డి, రాజూ నాయక్, ఖలీఫా, మల్లె జయేందర్, లక్ష్మయ్య, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.