బంజారాహిల్స్, డిసెంబర్ 19 : ఫిలింనగర్లోని దుర్గాభవానీనగర్ బస్తీలో అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ఇంటిపై వేసుకున్న గుడిసెల్లో షార్ట్ సర్క్యూట్తో సోమవారం మధ్యాహ్నం పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో మూడు గుడిసెలు దగ్ధమయ్యాయి. ఇంట్లోని సామగ్రితో పాటు సుమారు ఏడున్నర లక్షల నగదు బుగ్గిపాలయ్యింది. వివరాలు ఇలా ఇన్నాయి.. దుర్గాభవానీనగర్లోని ఓ ఇంటి మొదటి అంతస్తులో వేసిన గుడిసెలో అంగన్వాడీ టీచర్ లక్ష్మి, హనుమంతు దంపతులు అద్దెకు ఉంటున్నారు. అదే భవనంలోని రెండో అంతస్తులోని గుడిసెల్లో జొల్లు రాజు, చిట్టెమ్మ, శేఖర్ తదితరులు నివాసం ఉంటున్నారు. సోమవారం ఉదయం రోజు మాదిరిగానే పనుల్లోకి వెళ్లారు.
మధ్యాహ్నం సమయంలో గుడిసెల్లో షార్ట్సర్క్యూట్తో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు ఫిలింనగర్ ఫైర్ స్టేషన్కు సమాచారం ఇవ్వగా అక్కడకు చేరుకున్న ఫైర్ సిబ్బంది సుమారు గంటసేపు శ్రమించి మంటలు ఆర్పారు. అయితే అప్పటికే గుడిసెల్లోని సామగ్రి మొత్తం అగ్నికి ఆహుతయ్యింది. ఫర్నీచర్, టీవీలు, ఇతర వస్తువులు కాలిబూడిదయ్యాయి. కాగా హనుమతు ఇంట్లో దాచుకున్న రూ.2లక్షల నగదు, చిట్టెమ్మ ఇంట్లో దాచుకున్న రూ.4లక్షల నగదు, జొల్లు రాజుకు చెందిన రూ.1.50లక్షల నగదు మంటల్లో కాలిపోవడంతో వారు కన్నీరు మున్నీరయ్యారు. వేరేవాళ్లకు చెల్లించాల్సిన అప్పును తీర్చేందుకు డబ్బు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే కాలిబూడిదయ్యిందంటూ చిట్టెమ్మ బోరున విలపించింది. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెల్దండ వెంకటేశ్ అక్కడకు చేరుకుని వారిని ఓదార్చారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వపరంగా సాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. కాగా బాధితులకు తక్షణ సాయంగా కాంగ్రెస్ పార్టీ నేత డా.సి.రోహిన్రెడ్డి రూ.20వేల ఆర్థిక సాయాన్ని అందించారు.