24 గంటల కరెంటు తీసేసి.. 3 గంటల కరెంటు ఇస్తాం.. 10 హెచ్పీ మోటర్ పెట్టుకోవాలని కాంగ్రెస్ నేతలు అంటున్నరు.. రైతులకు 10 హెచ్పీ మోటర్.. కాంగ్రెసోడు కొనిస్తడా..? అని సీఎం కేసీఆర్ అన్నారు. సోమవారం బూర్గంపాడులో భద్రాచలం, పినపాక నియోజకవర్గాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు రేగా కాంతారావు, తెల్లం వెంట్రావ్లకు మద్దతుగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై ప్రసంగించారు. రోడ్లు, సాగునీరు, తాగునీరు, కరెంటుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాం. రాష్ట్ర సంపద పెరిగినాకొద్ది అందరూ బాగుండాలని పెన్షన్లను పెంచుకుంటూ పోతున్నాం.. రూ.2వేలు పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ఒక్కటే.
ఈ పద్ధతి కాంగ్రెస్ రాజ్యంలో ఎన్నడన్న ఆలోచన చేసిందా.? కరెంటు, సాగు, తాగునీటి సమస్యలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, రైతుల వలసలు, ఆకలి చావులు, అప్పులు కట్టలేక.. బోర్లు వేయలేక.. కరెంటు సరిగా రాక కాంగ్రెస్ హయాంలో దారుణమైన పరిస్థితి. రాష్ట్ర సంపద ఎంత పెరిగినా వాళ్లు పంచుకొని తిన్నారు తప్ప.. ఎన్నడూ ప్రజల క్షేమాన్ని కోరలేదు. వాళ్లు తెలివి లేకనా..? ఆలోచన లేకనా..? నదులు లేకుండెనా.? కృష్ణా, గోదావరి నదులను కొత్తగా తీసుకువచ్చానా.? అప్పుడే ఉండేనా..? మరి మంచినీళ్లు ఎందుకు రాలేదు.. ప్రజలపై ప్రేమ ఉంటే నీళ్లు రావాలంటే వచ్చి తీరాలే.. మొదటి ఐదేండ్లలో ప్రతి ఇంటికి నీళ్లు ఇవ్వకపోతే మళ్లీ ఎన్నికల్లో నిలబడం.. ఓట్లు అడగమని చెప్పాను.
కమిట్మెంట్తో పనిచేసినం. వెంట పడ్డాం.. తెచ్చి చూపించాం.. సీతారామ ప్రాజెక్టు మీ కండ్లముందే జరుగుతున్నది. ప్రాజెక్టు పూర్తికాగానే గోదావరి నుంచి మన ఇష్టమున్నని నీళ్లు తీసుకోవచ్చు. మన రోడ్లను.. పక్క రాష్ట్రం రోడ్లను చూడాలి.. మన పాలన ఎంత బాగుందో అర్థమవుతుంది. ఇక ప్రజలే ఆలోచన చేయాలి. భవిష్యత్లో ఇంకా చేయాల్సింది ఉంది. వంద శాతం మళ్లీ బీఆర్ఎస్ గవర్నమెంటే వస్తుంది. తెలంగాణ తెచ్చిన వాడిగా.. మీ బిడ్డగా రాష్ర్టాన్ని ఉజ్వలమైన తెలంగాణగా ముందుకు తీసుకువెళ్తాం.
కాంగ్రెస్ నేతలకు బుర్ర ఉన్నదా..? దేవుడు ఏం బుర్ర ఇచ్చిండో.. ఎంత బుర్ర ఉన్నదో తెలియదు కానీ.. కేసీఆర్ 24 గంటల కరెంటు వేస్ట్గా ఇస్తున్నడు అని అంటున్నరు.. రాహుల్ గాంధీకి ఎద్దు ఎరుకనా.. ఎవుసం ఎరుకనా.. ఎన్నడన్న పొలం దున్నిండా..? వ్యవసాయానికి మూడు గంటల కరెంటు ఇస్తే మనం వాడే మూడు, ఐదు హెచ్పీ మోటర్లతో ఒక మడన్న తడుస్తుందా.? మూడు గంటల్లో పొలం పారాలంటే 10 హెచ్పీ మోటర్ పెట్టుకోవాలంటా.. పది హెచ్పీ మోటర్ కాంగ్రెసోడు కొనిస్తడా..? తప్పిపోయి కాంగ్రెస్ను గెలిపిస్తే.. గ్యారంటీగా గోల్మాల్ చేస్తామని ఓపెన్గా చెబుతున్నరు.
ఒకడు కర్నాటక ఉప ముఖ్యమంత్రి వచ్చి మా గొప్పతనం తెలుసా..? మేం రూ.600 పెన్షన్ ఇస్తున్నాం.. కావాలంటే కర్నాటకకు వచ్చి చూడు అంటున్నడు.. మేం రూ.2వేలు ఇస్తున్నమని చెప్పాం. వ్యవసాయానికి 5 గంటల కరెంటు ఇస్తున్నాం.. తెలుసా నీకు అంటడు.. 24 గంటల కరెంటు ఇచ్చేకాడనా ఆయన చెప్పేది.
“కండ్ల ముందు గోదావరి.. నీళ్లకు చావాలి”., “వర్షాకాలం వచ్చిదంటే.. మంచం పట్టిన మన్యం” అంటూ పేపర్లలో వస్తుండే. ఇప్పుడు ఆ పరిస్థితి ఉన్నదా..? మిషన్ భగీరథతో ఇంటింటికి తాగునీరు వస్తున్నాయి. సీతారామ ప్రాజెక్టు మీ కండ్లముందే జరుగుతున్నది. ప్రాజెక్టు పూర్తికాగానే గోదావరి నుంచి మన ఇష్టమున్నని నీళ్లు తీసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అహంకారానికి హద్దులే లేవని, ఆయనేం పడగొడుతడో తెల్వదని సీఎం కేసీఆర్ అన్నారు.