బేగంపేట్, జనవరి 7: అర్హులైన లబ్ధిదారుల నుంచి వచ్చిన ఆరు గ్యారెంటీల్లో పలు పథకాలకు దరఖాస్తుల స్వీకరణ శనివారంతో ముగిసింది. గత నెల 28న ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ జనవరి 6తో ముగిసింది. ఆయా పథకాలను పొందేందుకు అధిక సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. సనత్నగర్ నియోజకవర్గంలో ఆరు డివిజన్లలో మొత్తం 24 సెంటర్లను ఏర్పాటు చేసి 96 కౌంటర్ల ద్వారా దరఖాస్తులను స్వీకరించారు. ఈక్రమంలో నియోజకవర్గం మొత్తంగా అభయహస్తం ద్వారా 56 వేల 3 దరఖాస్తులు రాగా, ఇతర వాటికి 18, 528 దరఖాస్తులు వచ్చినట్లు బేగంపేట్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శంకరయ్య తెలిపారు. స్వీకరించిన దరఖాస్తులను సోమవారం నుంచి ఆన్లైన్లో నమోదు ప్రక్రియను ప్రారంభించనున్నట్టు వారు తెలిపారు. ప్రధానంగా సనత్నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్, కార్పొరేటర్లు మహేశ్వరి, హేమలత, కొలన్ లక్ష్మి, మాజీ కార్పొరేటర్లు శేషుకుమారి, అరుణగౌడ్, ఆకుల రూపలు దరఖాస్తులు నింపడంలో దగ్గరుండి చూసుకున్నారు. ఇదిలా ఉండగా, నియోజకవర్గంలోని బన్సీలాల్పేట్ డివిజన్ నుంచి అధికంగా లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకోగా, అత్యల్పంగా అమీర్పేట్ డివిజన్ నుంచి దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.