బంజారాహిల్స్,ఏప్రిల్ 17: ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లు కట్టుకొని శాశ్వత నివాసం ఏర్పరుచుకున్న పేదలకు పూర్తిస్థాయిలో యాజమాన్య హక్కులు కల్పించే ఉద్దేశంతో జారీ చేసిన జీవో నంబర్ 58 , 59 కింద కటాఫ్ డేట్ పెంచుతూ ప్రభుత్వం అవకాశం ఇవ్వడంతో దరఖాస్తుల ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. దశాబ్దాలుగా ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లు కట్టుకుని నివాసం ఉంటున్న వారికి ఆయా ఇండ్లపై పూర్తిస్థాయి హక్కులు లేకపోవడంతో జీవో నంబర్ 58, 59లను ప్రభుత్వం జారీ చేసిన సంగతి తెలిసిందే. 2016 జారీ చేసిన ఈ జీవోల కింద షేక్పేట మండల పరిధిలో సుమారు 7వేలకు పైగా పేదలకు ఉచితంగా క్రమబద్ధీకరణ అవకాశం కల్పించారు. అయితే సరైన అవగాహన లేకపోవడంతో కొంతమంది క్రమబద్ధ్దీకరణకు దరఖాస్తు చేసుకోలేదు. దాంతో మరోసారి క్రమబద్ధ్దీకరణకు అవకాశం కల్పించాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రభుత్వాన్ని కోరడంతో గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా ఏప్రిల్ 1నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది.
హైదరాబాద్ జిల్లాలోనే అత్యధికంగా ప్రభుత్వ స్థలాలు కలిగిన షేక్పేట మండల పరిధిలోని అనేక బస్తీల్లో 2020లోపు ఇండ్లు కట్టుకున్నవారితో పాటు వేరే వ్యక్తుల వద్ద నుంచి నోటరీ ద్వారా ఇండ్లు కొనుగోలు చేసిన వారు తాజాగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గతంలో దరఖాస్తు చేసుకోనివారు ఈసారి క్రమబద్ధ్దీకరణ చేయించుకోవాలని నిర్ణయించుకుని ఈ మేరకు మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఫిలింనగర్లో 18 బస్తీలు, ఎన్బీటీనగర్, నందినగర్, వెంకటేశ్వరనగర్, ఇందిరానగర్, జవహర్నగర్ ప్రాంతాలకు చెందిన వారు దరఖాస్తులు చేసుకుంటున్నారు. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 7లోని మీసేవ కేంద్రంలో ఇప్పటివరకు సుమారు 600కు పైగా క్రమబద్ధ్దీకరణ దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. వరుస సెలవుల అనంతరం సోమవారం బంజారాహిల్స్లోని మీ సేవ కేంద్రంలో భారీగా వచ్చిన జనం దరఖాస్తులు చేసుకోవడం కనిపించింది. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులను స్వీకరించాల్సి వస్తోంది.
జీవో నంబర్ 59 కింద గతంలో దరఖాస్తు చేసుకున్న 434 మందికి ఇటీవల నోటీసులు జారీ చేశాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు జీవో నంబర్ 59 కింద అర్హతలు పొందిన వారిని గుర్తించి వారి ఇండ్లను రిజిస్టర్ చేయనున్నాం. ప్రభుత్వ మార్కెట్ విలువలో 10శాతం చెల్లిస్తే నేరుగా ఆయా ఇండ్లను లబ్ధ్దిదారులపేరుతో రిజిస్టర్ డీడ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. జీవో 59కింద పరిశీలన పూర్తయి నోటీసులు రెండు విడతల్లో రుసుం చెల్లించవచ్చు. జీవో నంబర్ 58 కింద కొత్తగా దరఖాస్తులు చేసుకున్న వారికి సంబంధించిన క్రమబద్ధ్దీకరణ కోసం ఏర్పాటు చేసిన కమిటీ ద్వారా అర్హులను ఎంపిక చేయనున్నాం.
-రామకృష్ణనాయక్, తహసీల్దార్, షేక్పేట మండలం