సిటీబ్యూరో, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : రెండో విడత ఇండ్ల పంపిణీకి అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 13,300 మంది లబ్ధిదారుల ఎంపిక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన శుక్రవారం ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరగనున్నది. ఎంతో పారదర్శకంగా ఎన్ఐసీ ఆధ్వర్యంలో రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా ర్యాండమైజేషన్ విధానంలో ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో ఆన్లైన్ డ్రా నిర్వహించి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు చెందిన లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. గత నెల 24న మొదటి విడతలో 11,700 మంది లబ్ధిదారులను ఇదే విధానంలో ఎంపిక చేసి ఈనెల 2న ఎనిమిది ప్రాంతాల్లో ఇండ్లను మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల చేతుల మీదుగా పంపిణీ చేశారు. రెండో విడతలో ఎంపికైన లబ్ధిదారులకు ఈ నెల 21న మంత్రి కేటీఆర్, ఇతర మంత్రుల చేతుల మీదుగా ఇండ్లను పంపిణీ చేయనున్నారు.
కలెక్టరేట్లో డ్రై రన్
జిల్లాలో రెండో విడత డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపు శుక్రవారం జరుగనున్నది. అందుకోసం ఎన్ఐసీ ఆధ్వర్యంలో ఆన్లైన్ ద్వారా ర్యాండమైజేషన్ విధానంలో లాటరీ తీయనున్నారు. ఈ మేరకు గురువారం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆధ్వర్యంలో డబుల్ బెడ్రూం లాటరీకి సంబంధించి డ్రై రన్ నిర్వహించారు. ఈ డ్రై రన్ కలెక్టర్ ఆధ్వర్యంలో విజయవంతమైనట్లు అధికారులు ప్రకటించారు. డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపు విధానంలో ఎటువంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా చూడాలని ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. ర్యాండమైజేషన్ ద్వారా ఎంపిక చేసే ఈ విధానంలో ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఇండ్ల కేటాయింపు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుసూదన్, డీఆర్వో వెంకటాచారి, ఎన్ఐసీ అధికారులు పాల్గొన్నారు.