సిటీబ్యూరో, జూలై 23 (నమస్తే తెలంగాణ) : వర్షాల నేపథ్యంలో సీజనల్, అంటువ్యాధులతో పాటు దోమలతో వచ్చే వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలకు జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. లోతట్టు, బస్తీ ప్రాంతాల్లో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నది. జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగంతో క్షేత్ర స్థాయిలో అంటువ్యాధులతో పాటు దోమల నివారణ, నియంత్రణ, కోసం సిబ్బంది, అధికారులు ఇంటింటికీ వెళ్లి అవగాహనతో పాటు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.
డెంగీ, మలేరియా నివారణకు అవగాహన
జీహెచ్ఎంసీ పరిధిలో దోమల నివారణకు ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. కరపత్రాలు, స్టికర్లు, ఇంటింటికీ అందజేయడం, ప్రధాన కూడళ్లు, జన సమూహం ఉండే ప్రాంతాల్లో క్లాత్ బ్యానర్ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అలాగే ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తూ ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఎంటమాలజీ విభాగంలో 1600 మంది ఏఎల్ఓలు పనిచేస్తున్నారని, జీహెచ్ఎంసీ పరిధిలో గల 4846 కాలనీలను మొత్తం కవర్ చేసేందుకు ఒకొకరికి 3 కాలనీల చొప్పున కేటాయించినట్లు చీఫ్ ఎంటమాలజిస్ట్ డాక్టర్ రాంబాబు తెలిపారు. కేటాయించిన కాలనీల్లో యాంటీ లార్వా ఆపరేషన్లు, డర్టీ వాటర్లో ఆయిల్ బాల్స్, గంబుషియా చేపలు దానితో పాటు ఫాగింగ్, పర్యవేక్షణ కూడా చూస్తారన్నారు. ఆడియో సౌకర్యం ఉన్న స్వచ్ఛ ఆటోలకు ఆడియో క్యాసెట్తో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
పగలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
పగటి పూట ఈడీస్ దోమలు కాటు వేయడం మూలంగా డెంగీ వ్యాధి వ్యాపిస్తుంది. ఇందుకు రాత్రి పూటతో పాటు పగలు కూడా అప్రమత్తంగా ఉండటం అవసరం. ఈడీస్ దోమలు మంచి నీటిలో పెరుగుతాయి. ఇంట్లో, ఇంటి ఆవరణలో నీటి నిల్వలు ఎకువ రోజులు లేకుండా చూసుకోవాలి.
నియంత్రణ పద్ధతులు..
దోమ లార్వాను నియంత్రించేందుకు సులభమైన పద్ధతి 5 మిల్లీ సామర్థ్యం కలిగిన టెమీ పాస్ 50 శాతం మందును 10 లీటర్ల నీటిలో కలిపి ఆ ద్రావణాన్ని దోమల పెరుగుదలకు అవకాశమున్న చోట 500 మీటర్ల (అర కిలో మీటర్ల) దూరం వరకు పిచికారి చేయాలి. మురుగు కాలువలు, వర్షపు నీటి గుంతలు, బోరు, నల్లాల వద్ద ఉండే నీటి గుంతలు, పంపులు, డ్రమ్ములు, తొట్టీల్లో నిలిచిన నీటి నిల్వల్లో స్ప్రే చేయాలి. ఆ ద్రావణాన్ని వారానికి ఒకసారి స్ప్రేయర్ను ఉపయోగించి పిచికారి చేయాలి.
ప్రతి ఆదివారం పది గంటలకు 10 నిమిషాలు..
ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు.. 10 వారాల పాటు పరిశుభ్రత పాటించాలని అధికారులు ప్రజలకు సూచించారు. కుటుంబ సభ్యులందరూ ఇంటి లోపల, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పనికి రాని వస్తువుల్లో నీరు నిల్వ లేకుండా, సిమెంట్ కుండీలు, డ్రమ్ములు ఇతరత్రా వస్తువులను శుభ్రం చేసుకొని యాంటి లార్వా పునరుత్పత్తి కాకుండా చర్యలు తీసుకున్నప్పుడే దోమల నివారణ సాధ్యమవుతుందని తెలిపారు.