మియాపూర్, జనవరి 21 : టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పటికీ పేదల పక్షపాతిగానే పని చేస్తుందని, వారి కష్టనష్టాల్లో అండగా నిలిచి భరోసాను కల్పిస్తుందని ప్రభుత్వ విప్ అరెకపూడిగాంధీ అన్నారు. పూరి గుడిసెలు కోల్పోయిన బాధితులకు వాటికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వమే పక్కా భవనాలను అందిస్తుందని, పేద వర్గాలు సంతోషంగా తమ కుటుంబాలతో వాటిల్లో నివసించవచ్చన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ బసవతారకనగర్లో ఇటీవల గుడిసెలు కోల్పోయిన 50 మంది బాధిత పేద ప్రజలకు హౌజింగ్ స్కీమ్ కింద పక్కా ఇండ్ల మంజూరు పత్రాలను ఆర్డీవో చంద్రకళ, తహసీల్దార్ వంశీమోహన్, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, మాజీ కార్పొరేటర్ సాయిబాబాతో కలిసి శుక్రవారం మియాపూర్లోని క్యాంపు కార్యాలయంలో అందించారు. ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ.. బాధితులలో చాలా మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి న్యాయస్థానంలో ప్రక్రియతో ప్రమేయం లేకుండా తమకు న్యాయం చేయాలని, పక్కా ఇండ్లను కేటాయించి తమను ఆదుకోవాలని తనను సంప్రదించారన్నారు. వెంటనే సమస్యను మంత్రి సహా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పేదలకు త్వరగా పక్కా ఇండ్ల మంజూరుకు కృషి చేసినట్లు తెలిపారు. అర్హులైన పేదలకు తాము, తమ ప్రభుత్వం ఎప్పటికీ అండగా నిలుస్తుందన్నారు.
పక్కా ఇండ్ల మంజూరు పత్రాలు అందుకున్న అర్హులైన పేదలలో ఎనలేని సంతోషం నెలకొన్నదని, వారి జీవితాల్లో వెలుగులు నింపటం నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా తనకు ఆనందంగా ఉందని, ప్రతిగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారన్నారు. పేదలను ఏనాడు తమ ప్రభుత్వం నష్టపోనివ్వదని, కొందరు స్వార్థ రాజకీయ నేతలు తమ రాజకీయ ప్రయోజనం కోసం ఈ అంశాన్ని వాడుకుని పేద ప్రజలకు లబ్ధి కలుగకుండా అడ్డుపడ్డారని, దీనిని ప్రజలంతా గమనించారన్నారు. గుడిసెలు కోల్పోయిన బాధితులకు పక్కా ఇండ్ల మంజూరు పట్ల ప్రభుత్వానికి విప్ గాంధీ నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వేయర్ మహేశ్, సీనియర్ అసిస్టెంట్ చంద్రారెడ్డి, ఆర్ఐలు శ్రీకాంత్, శ్రీనయ్య, పార్టీ నేతలు రాజునాయక్, సురేందర్, జంగయ్య, అంజమ్మ, రాజు, జగదీశ్, రమేశ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.