Hyderabad | భానుడి భగభగలకు భాగ్యనగరం వాసులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఉదయం 8 గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం గత మూడేండ్లలో ఎన్నడూ లేనంతగా ఫిబ్రవరి నెలలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల కంటే అధికంగా నమోదు అవుతున్నాయి. అయితే రాబోయే రోజుల్లోనూ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ విభాగం అధికారులు హెచ్చరించారు.
వాతావరణ శాఖ ప్రకారం.. 2022, ఫిబ్రవరి 23వ తేదీన హైదరాబాద్లో అత్యధికంగా 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. 2020, ఫిబ్రవరిలో 34.7, 2021, ఫిబ్రవరిలో 36 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఈ ఏడాది ఇప్పటికే 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, దాదాపు మూడు సార్లు 36 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
గురువారం రోజు 35.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ఆదివారం నాటికి 37 డిగ్రీల సెల్సియస్ దాటే అవకాశం ఉంది. ఫిబ్రవరి నెల ముగిసే సమయానికి 38 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చేరుకునే అవకాశం ఉంది.