సిటీబ్యూరో/శంషాబాద్ రూరల్, మే 1 (నమస్తే తెలంగాణ) : ఔటర్రింగ్ రోడ్డుపై శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. సనత్నగర్లో నివాసముండే సిరిసిల్ల వాసులు శుక్రవారం ఉదయం యాదాద్రి దర్శనానికి వెళ్లారు. లక్ష్మినరసింహాస్వామితో పాటు స్వర్ణగిరి ఆలయాన్ని దర్శనం చేసుకొని తిరిగి సాయంత్రం కారులో ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. ఓఆర్ఆర్ మీదుగా సనత్నగర్కు వెళ్తున్నారు. అదే సమయంలో సూర్యాపేట నుంచి నూకల లోడ్తో నంద్యాలకు వెళ్తున్న లారీ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 16కు సమీపంలో ఆగి ఉన్నది. ఈ క్రమంలో వీరి కారు వెనుక నుంచి ఆగి ఉన్న ఆ లారీని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంతో కారు నుజ్జునుజ్జయ్యింది. అందులో ఏడుగురిలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మృతులు బొల్లి శివకుమార్(37), ఆయన భార్య రాజశ్వేరి అలియాస్ లాస్య(35), బొల్లి రిషిత(7), కోడం శ్రీనివాస్(40), కోడం కృష్ణ చంద్ర(13), కోడం మాధవ్(10)గా గుర్తించారు. కోడం శ్వేతకు తీవ్ర గాయాలు కావడంతో ఆమెను చికిత్స కోసం దవాఖానకు తరలించారు.
ఈ ఘెర ప్రమాదం కేవలం కారు డ్రైవర్ అలసిపోవడం, వేగం, నిద్రమత్తు వంటి కారణాలే కాదని.. అధికారుల పర్యవేక్షణ లోపం, క్షేత్ర స్థాయిలో భద్రతా ప్రమాణాల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నదని ప్రజలు చెబుతున్నారు. అత్యంత వేగంతో ప్రయాణించే ఔటర్ రింగ్ రోడ్డుపై ఎక్కడ పడితే అక్కడ వాహనాలను ఆపకూడదనే కఠిన నిబంధనలున్నప్పటికీ, లారీ డ్రైవర్లు, ఇతర భారీ వాహనాలను ఇష్టారాజ్యంగా రోడ్డు పక్కన వాహనాలను నిలిపేస్తున్నారు.
ఆగి ఉన్న వాహనాలను వెనుక నుంచి ఢీకొట్టి ఓఆర్ఆర్పై ఎందరో ప్రాణాలు కోల్పోయిన ఘటనలున్నాయి. కాగా, రోడ్డు ప్రమాదం జరిగిన్నట్లు సమాచారం తెలుసుకున్న శ్వేత బంధువులు కొందరు శంషాబాద్కు చేరుకున్నారు. శ్వేతకు ఏమైందంటూ.. కన్నీరు మున్నీరయ్యారు. రంగారెడ్డి డీఎంహెచ్వో శంషాబాద్ పట్టణంలో చికిత్స పొందుతున్న శ్వేత ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. దవాఖానాకు చేరుకొని అక్కడి వైద్యులతో మాట్లాడి శ్వేతకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.
రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు శంషాబాద్కు చురుకున్న ఆయన వ్యక్తిగత కార్యదర్శి మహేందర్ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతున్న శ్వేత ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆమెకు మరింత మెరుగైన చికిత్స అందించాలని, వెంటనే కిమ్స్ దవాఖానకు తరలించాలని కోరడంతో ఆమెను అక్కడికి తరలించారు.