కుత్బుల్లాపూర్/జీడిమెట్ల, అక్టోబర్ 5: ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ స్వరాష్ట్రం కోసం కొట్లాడుతుంటే ఢిల్లీలో అప్పటి ఆంధ్రాపాలకులు తమ ఆందోళనలను చూసి హేళన చేశారని, ఎంతో మంది బలిదానాలు..మరెన్నో పోరాటాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకెళ్తుంటే.. ఆంధ్రా పాలకులు శభాష్ అని చెప్పడం యావత్ తెలంగాణకే గర్వకారణామని హోం మంత్రి మహమూద్అలీ అన్నారు. గురువారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధి దుండిగల్ గ్రామంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్రాజులతో కలిసి కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, సనత్నగర్, కంటోన్మెంట్(సికింద్రాబాద్) నియోజకవర్గాలకు చెందిన 2550 మంది లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను అందించారు.
ఈ సందర్భంగా హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి బంగారు తెలంగాణగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్కే సాధ్యమైందన్నారు. కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ విజేందర్రెడ్డి, ఆర్డీవో శ్యామ్కుమార్, కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమత తదితరులు పాల్గొన్నారు.
పేదలు బ్రాండ్ అంబాసిడర్లు కావాలి
పేదలంతా బ్రాండ్ అంబాసిడర్లు కావాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు విజయవంతంగా ముందుకెళ్తున్నాయి. లక్షల విలువలతో కూడిన ఇండ్లను అర్హులకు అందించాం. సీఎం కేసీఆర్ హయాంలో ప్రజా సంక్షేమంతో పాటు రాష్ర్టాభివృద్ధే లక్ష్యంగా సాగుతున్న సుపరిపాలనలో పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలి.
-ఎమ్మెల్యే వివేకానంద్
దేశంలోనే తెలంగాణఆదర్శంగా నిలిచింది
రెండు పడకల ఇండ్ల నిర్మాణ పథకంలో దేశంలోనే ఆదర్శంగా తెలంగాణ నిలిచింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను పేదలు సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలి. రాబోయే రోజుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్రూం ఇండ్లను అందించేందుకు చర్యలు తీసుకుంటాం. ఎవరూ నిరుత్సాహపడవద్దు.
– ఎమ్మెల్సీ శంభీపూర్రాజు