చార్మినార్, ఏప్రిల్ 25 : రాష్ట్రంపై విషం చిమ్ముతూ, అభివృద్ధికి ఆటంకాలు కలిగిస్తూ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను దేశ ప్రజలందరూ గమనిస్తున్నారని హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. మంగళవారం బహదూర్పుర నియోజకవర్గంలో దూద్బౌలి డివిజన్ అధ్యక్షులు రాకేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రతినిధుల సభకు ముఖ్యఅతిథిగా హోంమంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ దేశంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో ప్రతి ఇంటికి తాగునీరు ఉచితంగా అందిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోని సంక్షేమ పథకాలను కేంద్రంలోని మంత్రులే అనేక సందర్భాల్లో ప్రశంసించారని అన్నారు. పర్యాటకులుగా రాష్ర్టానికి వచ్చే రాజకీయ నేతలు అధికారంలోకి వస్తే ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పడం బీజేపీ నాయకుల అహంభావానికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో హిందూ ముస్లింలు కలిసి మెలిసి ఉంటున్నా.. వారి మధ్యన చిచ్చు పెట్టి రాజకీయ లబ్థి పొందాలని బీజేపీ నేతలు ఆశపడుతున్నారని తెలిపారు. దేశానికి కేసీఆర్ ప్రధాని అయితే ప్రపంచ ఆర్థిక స్థితిగతుల్లో మెరుగైన స్థానంలో భారతదేశం నిలబడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బహదూర్పుర ఇన్చార్జి ఇనాయత్అలీ భాఖ్రీ, గడ్డం సత్యనారాయణ, అనిల్, ఇస్మాయిల్ఖాన్తోపాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.