కంటోన్మెంట్, మార్చి 12: తెలంగాణ అభివృద్ధి చెందాలంటే మోదీతోనే సాధ్యమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. సికింద్రాబాద్లోని ఇంపీరియల్ గార్డెన్స్లో మంగళవారం నిర్వహించిన సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో హోం మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్ల కాలంలో అవినీతిని అంతం చేసినట్లు తెలిపారు. దేశం సురక్షితంగా ఉండాలంటే మూడోసారి మోదీని ప్రధానిని చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి సోషల్ మీడియా కార్యకర్త నిరంతరం అప్రమత్తంగా పనిచేయాలని కోరారు. ఐదొందల ఏళ్ల కల నెరవేర్చిన ఘనత మోదీ సర్కార్ కే దక్కిందన్నారు. గతంలో కాంగ్రెస్ సర్కార్ చేయని పనిని ప్రధాని చేసి చూపించారని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు చేసిన ఘనత మోదికే దక్కుతుందన్నారు.
కాంగ్రెస్ పార్టీ దానిని రాజకీయం మాత్రమే చేసిందన్నారు. రాహుల్ బాబా విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్లతాడని మండి పడ్డారు. సర్జికల్ స్టై్కక్ చేసి ఉగ్రవాదం భరతం పట్టినట్లు తెలిపారు. ఇండియా అలయన్స్ ఎన్ని ప్రయత్నాలు చేసినా బీజేపీ గెలుపును ఎవరు ఆపలేరన్నారు. 400 స్థానాల్లో 12 కంటే ఎక్కువ స్థానాలను తెలంగాణ నుంచి గెలుపొందాలని పిలుపునిచ్చారు. ట్రిపుల్ తలాక్ తీసేసిన వ్యక్తి మోదీ అన్నారు. మహిళ రిజర్వేషన్, సీఏఏ నిర్ణయాలు చారిత్రాత్మకమన్నారు. అయితే, సీఏఏని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిందన్నారు. కాంగ్రెస్ పార్టీలో అనేక కుంభకోణాలు జరిగాయని, వాటి పై సీఎం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్, కంటోన్మెంట్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, కార్పొరేటర్ దీపిక తదితరులు పాల్గొన్నారు.