సికింద్రాబాద్, జనవరి 17: ఎత్తైన ఇంటిపై హోర్డింగ్ ఉంది. గాలి వాన వచ్చినప్పుడల్లా ఆ ఇంటికి సమీపంలో నివాసం ఉంటున్న స్థానికులు ఆ హోర్డింగ్ పడుతుందేమోనని ఆందోళన వారిని వెంటాడుతునే ఉంటుంది. ఇలాంటి ఘటనలు బోర్డు పరిధిలోని పలు ప్రాంతాల్లో దర్శనమిస్తున్నాయి. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని తిరుమలగిరి, బొల్లారం, మారేడ్పల్లి, బోయిన్పల్లి, అన్నానగర్, తాడ్బంద్ ప్రాంతాల్లో వాణిజ్య ప్రకటనలకు సంబంధించిన హోర్డింగులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. వీటిని ప్రత్యేకంగా నాలుగు రోడ్ల కూడళ్లు, జనసమూహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారు. కంటోన్మెంట్ బోర్డు ఆదాయాన్ని పెంచుకునే దిశగా అడిగిందే తడవుగా వెంటనే అనుమతులు ఇస్తుంది.
ఎందుకంటే వీటి ద్వారా కంటోన్మెంట్ బోర్డుకు ఏడాదికి రూ.లక్షల్లో ఆదాయం సమకూరుతుండగా మిగతా ప్రాంతాల్లో సైతం లక్షల్లో ఆదాయం పన్నుల రూపంలో వస్తుంది. ఈ విధంగా ఆదాయం సమకూరుతున్న నేపథ్యంలో హోర్డింగులు ఏర్పాటు చేసుకునేందుకు బహుళ జాతి సంస్థలు, ఇతర ప్రైవేట్ సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా హోర్డింగులు ఏర్పాటు చేస్తున్నా అధికారులు పట్టించుకోవటం లేదు. హోర్డింగుల ఏర్పాటులో కనీస భద్రతా చర్యలు చేపట్టడం లేదు. తిరుమలగిరిలోని ప్రధాన కూడలి నుంచి ఇటు కార్ఖానా చౌరస్తా, అటు లాల్బజార్ వరకూ రహదారులకు ఇరువైపులా ఏర్పాటు చేసిన హోర్డింగుల చుట్టూ విద్యుత్ తీగలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో హోర్డింగులు ప్రమాదకర స్థాయిలో ఉన్నా ఎవరూ వాటి గురించి పట్టించుకోవడం లేదు. వీలైనంత వరకూ తక్కువ ఎత్తులోనే ఏర్పాటు చేస్తే మంచిది. ఇదే సమయంలో విద్యుత్ తీగలకు దూరంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
నిబంధనలకు తూట్లు
సాధారణంగా వివిధ కార్పొరేట్, బహుళజాతి సంస్థలు, విద్యాసంస్థలకు సంబంధించిన ప్రచార హోర్డింగులు ఏర్పాటు చేయాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. ముందుగా కంటోన్మెంట్ బోర్డులోని ఇంజినీరింగ్ విభాగం నుంచి అనుమతులు పొందాలి. లైసెన్స్దారులు ప్రజారోగ్యం, ప్రజాసౌకర్యం, వీధుల్లో రాకపోకలకు ఏవిధమైన ఆటంకం కలిగించొద్దు. పర్యవేక్షించాల్సిన ఇంజినీరింగ్ అధికారులు మామూళ్లు తీసుకుని చూసీచూడనట్లుగా వ్యవహరించడంతో కొందరు అక్రమార్కులు కంటోన్మెంట్ బోర్డు ఆదాయానికి గండికొడుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి హోర్డింగుల ఏర్పాటులో నిబంధనలు పాటించాలని ప్రజలు కోరుతున్నారు.
చర్యలు తీసుకుంటాం
అనుమతులు లేకుండా హోర్డింగ్లు ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటాం. నివాసాలకు దూరంగా ఉండడంతో పాటు నిబంధనల ప్రకారం హోర్డింగ్ ఏర్పాటు చేస్తేనే అనుమతులిస్తాం. ప్రమాదకరంగా ఉన్నటువంటి హోర్డింగ్లపై దృష్టి సారించాం. నిబంధనలకు తిలోధకాలు ఇస్తే కఠినంగా వ్యవహరిస్తాం. ఆయా ప్రధాన కూడళ్లతో పాటు చౌరస్తాల వద్ద ఏర్పాటు చేసిన హోర్డింగ్లపై నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నాం.
– గోపాలకృష్ణదాస్, చీఫ్ ఇంజినీర్, కంటోన్మెంట్ బోర్డు.