సిటీబ్యూరో, జూన్ 8 (నమస్తే తెలంగాణ): నగరంలో డ్రగ్ విక్రయాలపై హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ (హెచ్న్యూ) గట్టి నిఘాను కొనసాగిస్తున్నది. మెడికల్ దుకాణాల చాటున వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు పదార్థాలు విక్రయించే వారిని సైతం అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తున్నారు. నిబంధనలు పాటించని మందుల దుకాణాల నివేదికను తయారు చేసి సంబంధింత డ్రగ్ కంట్రోల్ విభాగానికి అందజేస్తున్నారు. హెచ్న్యూ నివేదికతో ఆయా మాతృ సంస్థలు నిబంధనలు పాటించని దుకాణాల లైసెన్స్లు రద్దు చేస్తున్నాయి.
ఇది నెట్ వర్క్..
దక్షిణ ఢిల్లీకి చెందిన పవన్ అగర్వాల్ అక్రమంగా కొడీన్ ఫాస్ఫెట్ సిరఫ్ (దగ్గు మందు)ను ఎలాంటి బిల్లులు లేకుండా అంబర్పేట్లోని మహ్మద్ బషీర్ అహ్మద్కు చెందిన బయోస్పేర్ మెడికల్ ఏజెన్సీకి రూ.40కు ఒక బాటిల్ను సరఫరా చేశాడు. సైదాబాద్కు చెందిన సత్యనారాయణ, ఉప్పల్లోని అక్షయ మెడికల్కు చెందిన పోచం వేణుకు ఈ మందులు సరఫరా అవుతుండగా.. అక్కడి నుంచి ఓల్డ్సిటీ, నాంపల్లి, మెహిదీపట్నం, మలక్పేట, అంబర్పేట తదితర ప్రాంతాల్లో ఒక బాటిల్ రూ. 200 చొప్పున నిబంధనలకు విరుద్ధంగా విక్రయించారు. దగ్గు కోసం వాడే ఈ ముందును వైద్యుడి ప్రిస్క్రిప్షన్ మేరకు వాడాలి. అయితే, ఇక్కడ ప్రధాన సరఫరా దారుడి నుంచి వినియోగదారుడి వరకు ఎక్కడ కూడా బిల్లులు, ప్రిస్క్రిప్షన్స్ లేదు. ఈ మందు తయారీలో ఓపియమ్కు సంబంధించిన డ్రగ్ను వినియోగిస్తారు. మత్తు ఎక్కించే మందు కావడంతో ఎలాంటి బిల్లులు లేకుండా, అక్రమ పద్ధతిలో వీటిని వాడుతున్నట్లు పోలీసులు గుర్తించి.. ఈ ముఠాను అరెస్ట్ చేశారు.
అంతా గప్చుప్..
అల్ఫ్రాజోలం ట్యాబెట్లను తప్పని సరిగా వైద్యుల ప్రిస్క్రిప్షన్ మేరకే ఉపయోగించాలి. కాచిగూడకు చెందిన గణేశ్ ఫార్మాసూటికల్స్ సంస్థ యజమాని అద్దంకి వెంకట సురేశ్ రాజస్తాన్కు చెందిన బయో-ల్యాబ్ రెమెడీస్ నుంచి, హైదరాబాద్లోని కవాడిగూడకు చెందిన అజంత మెడికల్ ఏజెన్సీ నుంచి ఎలాంటి బిల్లులు లేకుండా తక్కువ ధరకు కొనుగోలు చేసి, వాటిని న్యూ గడ్డిఅన్నారానికి చెందిన జి.పూర్ణచందర్, మీర్పేట్కు చెందిన మల్లేశ్, లంగర్హౌస్కు చెందిన ఆర్.శ్రీనివాస్రెడ్డి, రామంతాపూర్కు చెందిన కొండా వేణుగోపాల్ (జోహోన్లీ ఫార్మా, జోనల్ మేనేజర్)లకు విక్రయించాడు. వీరంతా మెడికల్ స్టోర్లలో పనిచేస్తారు. వీరు మెడికల్ దుకాణదారులైన శ్రీధర్, పవన్కుమార్, మహ్మద్ అబ్దుల్ హఫీజ్, మహ్మద్ అబ్దుల్ సమీ, జహీరుద్దీన్, నీరజ్ సింగ్ తదితరుల ద్వారా అవసరమైన వారికి 20 నుంచి 30 పైసలు ధర ఉండే వీటిని రూ. 12 వరకు విక్రయించారు.
ఐదు ప్రాంతాల్లో దందా..
ఈ తరహా నగరంలో నిబంధనలకు విరుద్ధంగా మందులు విక్రయిస్తున్న మలక్పేట, అంబర్పేట, కుల్సుంపురా, గోపాలపురం, రెయిన్బజార్ ప్రాంతాల్లోని మెడికల్ దుకాణాలపై కేసులు నమోదు చేసిన హెచ్న్యూ అధికారులు దాదాపు 20 మందిని అరెస్టు చేశారు. అనంతరం హెచ్న్యూ అధికారులు ఈ కేసుల నివేదికలను సంబంధిత డ్రగ్స్ కంట్రోల్ అధికారులకు పంపించారు. హెచ్న్యూ అధికారులు అందించిన నివేదిక ఆధారంగా రంగంలోకి దిగిన డ్రగ్స్ కంట్రోల్ అధికారులు చర్యలు మొదలు పెట్టారు. బుధవారం నగరంలోని కొన్ని మందుల దుకాణాలపై చర్యలు తీసుకున్నారు.