నగర ప్రజలకు తాగునీరు అందించేందుకు జలమండలి అనేక చర్యలు చేపడుతున్నది. అత్యాధునిక టెక్నాలజీతో హైదరాబాద్కు మంచినీటి సరఫరా, మురుగునీటి పారుదల సేవలను అందిస్తున్నది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని వేల కోట్లతో పలు ప్రాజెక్టులను నిర్మిస్తున్నది. ఇప్పటికే జీహెచ్ఎంసీలో 20 కేఎల్ ఉచిత నీటి సరఫరా పథకం కింద 9.7 లక్షల మందికి లబ్ధి చేకూరుతున్నది. ఎండాకాలంలో తాగునీటి సరఫరా కోసం కృష్ణా నుంచి ముడి జలాలను సేకరించే సమస్యను అధిగమించేందుకు రూ.1450 కోట్లతో చేపట్టే ప్రాజెక్టుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. అంతేకాక నగరంలోని ముఖ్య ప్రాంతాల్లోని సర్కిళ్లు, ఓఆర్ఆర్ చుట్టు పక్కల గ్రామాలను కవర్ చేస్తూ 62 మురుగు నీటి శుద్ధి చేసే ప్లాంట్లను నిర్మిస్తున్నది.