రోజురోజుకు విస్తరిస్తున్న హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలకు మెరుగైన రవాణా వ్యవస్థను కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని గ్రేటర్కు మణిహారంగా మారిన ఓఆర్ఆర్ చుట్టూ హెచ్ఎండీకే అనేక ప్రాజెక్టులను తీసుకువస్తున్నది. ఇందులో భాగంగా బుద్వేల్లో హెచ్ఎండీఏ అభివృద్ధి చేస్తున్న 180 ఎకరాల లేఅవుట్ను పూర్తిగా ఐటీ కంపెనీలు, ఆకాశహర్మ్యాలు నిర్మించేందుకు అనుగుణంగా ప్లాట్లను అభివృద్ధి చేస్తున్నది. ఈ నేపథ్యంలో లేఅవుట్కు సమీపంలోనే ఉన్న ఔటర్ రింగు రోడ్డు, దాని వెంటే కొత్తగా నిర్మిస్తున్న ఎయిర్పోర్టు మెట్రో ఎక్స్ప్రెస్ కారిడార్తో బుద్వేల్ లేఅవుట్ అనుసంధానం చేయాలని నిర్ణయించారు. ఒక రోడ్డును ఓఆర్ఆర్కు అనుసంధానం చేయగా, ఓఆర్ఆర్ లోపలి వైపు నుంచే వస్తున్న మెట్రో మార్గంలోను కలిసేలా లే అవుట్ను రూపొందించారు.
– సిటీబ్యూరో, జూలై 30 (నమస్తే తెలంగాణ)
నియోపోలీస్ లేఅవుట్ తరహాలో..
బుద్వేల్ లేఅవుట్లో మొత్తం 20 ప్లాట్ల లోపే ఏర్పాటు చేసి, వాటిలో పూర్తిగా ఐటీ కంపెనీలు, భారీ బహుళ అంతస్తుల భవనాలు నిర్మించేలా మౌలిక వసతులు కల్పిస్తున్నారు. ప్రస్తుతం కోర్ సిటీలో ఎదురవుతున్న సమస్యలు శివార్లలో పునరావృతం కాకుండా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారు. పెట్టుబడులకు ప్రత్యేక ఆకర్షణగా మారిన ఔటర్ రింగు రోడ్డు పొడవునా హెచ్ఎండీఏ చేపడుతున్న భారీ ప్రాజెక్టులకు రోడ్డు మార్గాలు మెరుగ్గా ఉండేలా చూస్తున్నారు. మూడేళ్లలోఎయిర్పోర్టు మెట్రో ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుండగా, బుద్వేల్ హెచ్ఎండీఏ లేఅవుట్ను అంతకంటే ముందే అందుబాటులోకి తీసుకురానున్నారు. ఏడాదిన్నరలో కోకాపేట నియోపోలీస్ లేఅవుట్ తరహాలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఐటీ సిగలో.. అద్భుతం
నగర శివారులో హెచ్ఎండీఏ అనేక ప్రాజెక్టును చేపట్టడంతో పాటు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి చేస్తున్నది. విషాలమైన రోడ్లు, డ్రైనేజీ, ఫుట్పాత్లు, తదితర మౌలిక వసతులు కల్పించడంతో పాటు రోడ్ల వెంట నగర వాసులను ఆలోచింపజేసేలా, ఆకట్టుకునేలా అద్భుతమైన కళాకండాలను ఏర్పాటు చేస్తున్నది. రోడ్లకు ఇరువైపులా.. ప్రధాన సర్కిళ్ల వద్ద ఏర్పాటు చేసిన వాటర్ ఫౌంటెన్లు, వాకింగ్ ట్రాక్లు, సైకిల్ ట్రాక్లు, కళాకండాలు.. ఇలా అనేకం ఐటీ ఉద్యోగులచే ఔరా అనిపిస్తున్నాయి. అంతే కాకుండా హెచ్ఎండీకే పనితీరుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
ఐటీ కంపెనీలే లక్ష్యంగా..
ఐటీ కారిడార్లోని కోకాపేటలో నియోపోలీస్ (ఎస్ఈజెడ్-స్పెషల్ ఎకనామిక్ జోన్) పేరుతో గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టుగా హెచ్ఎండీఏ చేపట్టింది. ఇక్కడ ఎకరాల్లోనే ప్లాట్ల సైజులను నిర్ణయించారు. అదేవిధంగా బుద్వేల్లో చేపడుతున్న 180 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న లేఅవుట్లోనూ సుమారు 20 ప్లాట్లను ఏర్పాటు చేస్తుండగా ఒక్కో ప్లాటు విస్తీర్ణం 3 ఎకరాల నుంచి 10 ఎకరాల విస్తీర్ణంలో ఉండేలా నిర్ణయించారు. ఈ లేఅవుట్లో 150, 120 అడుగుల వెడల్పుతో విశాలైన రోడ్లు, అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్స్, మంచినీరు, డ్రైనేజీ లైన్లను ఏర్పాటు చేయనున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి, ఐటీ కారిడార్ నుంచి ఓఆర్ఆర్ మీదుగా 15-20 నిమిషాల వ్యవధిలోనే బుద్వేల్ లేఅవుట్కు చేరుకునేలా రోడ్డు, మెట్రో మార్గాన్ని అనుసంధానం చేసేందుకు హెచ్ఎండీఏ అధికారులు దృష్టి సారించారు. ఇప్పటికే లేఅవుట్కు సంబంధించిన ప్రాథమిక పనులు పూర్తి కాగా, త్వరలోనే ఆన్లైన్లో వేలం ద్వారా విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆగస్టు మొదటి వారంలో కోకాపేట నియోపోలిస్ లేఅవుట్లో ప్లాట్ల ఆన్లైన్ వేలం ముగిసిన తర్వాత బుద్వేల్ లేఅవుట్లో ప్లాట్లను విక్రయించనున్నట్లు హెచ్ఎండీఏ యంత్రాంగం పేర్కొంది.