సిటీబ్యూరో, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): పర్యావరణ పరిరక్షణలో భాగంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో లక్ష వినాయకులను పంపిణీ చేస్తున్నారు. మట్టి గణపతిఊనే పూజిద్దా.. అంటూ ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకుగానూ తమ వంతు బాధ్యతగా ఉచితంగా 8 అంగుళాల పొడవుతో కూడిన మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నామని పురపాలక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్ఎండీఏ కమిషనర్ అరవింద్ కుమార్ తెలిపారు.
శుక్రవారం నగరంలో సుమారు 20కి పైగా ప్రాంతాల్లో 20వేల విగ్రహాల వరకు పంపిణీ చేశారని, అదేవిధంగా శని, ఆదివారాల్లో సుమారు 41 కేంద్రాలను ఎంపిక చేశామని, ఆయా కేంద్రాల వద్ద అధికారులు, ఉద్యోగులు స్వయంగా విగ్రహాలను ఉచితంగా అందజేస్తారని తెలిపారు. హెచ్ఎండీఏ తరఫున విగ్రహాల పంపిణీకి ఇన్చార్జులుగా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బి.శంకర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎం.దేవేందర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఈనెల 30వ తేదీ వరకు ఎంపిక చేసిన కేంద్రాల్లో మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తారని తెలిపారు.