సిటీబ్యూరో, జనవరి 17 (నమస్తే తెలంగాణ) : వివాదాలు లేని ప్రభుత్వ భూములను పారదర్శకంగా విక్రయించేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు చర్యలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టీసీ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని, 7వ తేదీ వరకు ధరావతు (ఈఎండీ) చెల్లించిన వారే 18న జరిగే ఆన్లైన్ వేలంలో పాల్గొనేందుకు అర్హులు.
బుధవారం ఉదయం, మధ్యాహ్నం వేళల్లో ఆన్లైన్లోనే భూముల విక్రయాలు ఉంటాయని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. గ్రేటర్ చుట్టూ హెచ్ఎండీఏ పరిధిలోని రంగారెడ్డిలో 13 చోట్ల, మేడ్చల్లో 8 చోట్ల, సంగారెడ్డి జిల్లాలో 17 చోట్ల మొత్తం కలిపి 38 చోట్ల ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఈ భూముల మొత్తం విస్తీర్ణం 1,21,000 చదరపు గజాలు ఉంది. ఈ భూముల విక్రయం ద్వారా సుమారు రూ.700 కోట్ల నుంచి 800 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది.