సిటీబ్యూరో, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ)/ మియాపూర్ : రంగారెడ్డి జిల్లా పరిధిలో విక్రయానికి ఉన్న భూములకు మంచి డిమాండ్ ఉందని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. మంగళవారం శేరిలింగంపల్లి జీహెచ్ఎంసీ జోనల్ ఆఫీస్ మీటింగ్ హాలులో హెచ్ఎండీఏ నిర్వహించిన ప్రీబిడ్ సమావేశానికి దాదాపు వంద మందికి పైగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి, గండిపేట, ఇబ్రహీంపట్నం మండలాల పరిధిలో ఉన్న ల్యాండ్ పార్సిల్స్ వివరాలను అధికారులు వెల్లడించారు.
ఈ ప్రాంతాల్లో విక్రయానికి ఉన్న ప్రభుత్వ స్థలాలకు ఎలాంటి వివాదాలు లేవని రెవెన్యూ అధికారులు తెలిపారు. మార్చి 1వ తేదీన ఈ ల్యాండ్ పార్సిల్స్ను ఎం.ఎస్.టి.సి ఆధ్వర్యంలో ఆన్లైన్ వేలం ద్వారా హెచ్ఎండీఏ విక్రయించడానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా కొనుగోలుదారుల సందేహాలను హెచ్ఎండీఏ ఎస్టేట్ ఆఫీసర్ కె.గంగాధర్ నివృత్తి చేశారు. ఆన్లైన్ వేలంలో పాల్గొనడానికి వీలుగా ఈ నెల 27న సాయంత్రం 5 గంటల వరకు ఎం.ఎస్.టి.సిలో రిజిస్ట్రేషన్(నమోదు) చేసుకోవాలని, రిజిస్టర్ అయిన వారు 28వ తేదీ సాయంత్రం 5 గంటల గడువు లోపు నిర్దేశించిన ఈఎండీ రుసుము చెల్లించాలని అధికారులు కొనుగోలుదారులకు వివరించారు. ఈ సమావేశంలో రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్(ఆర్డీవో) కె.చంద్రకళ, గండిపేట్ తాసీల్దార్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.