సిటీబ్యూరో, జూలై 26 (నమస్తే తెలంగాణ): హుస్సేన్సాగర్ తీరం అత్యంత ఆదరణ కలిగిన పర్యాటక ప్రదేశంగా మారింది. సాగర తీరాన్ని సరికొత్తగా తీర్చిదిద్దేందుకు హెచ్ఎండీఏ చర్యలు చేపట్టింది. ఇటీవల ప్రారంభమైన రాష్ట్ర నూతన సచివాలయం, 125 అడుగుల డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహంతో పాటు అమరవీరుల స్మారక చిహ్నంతో ఈ ప్రాంతమంతా సందర్శకులతో సందడిగా మారింది. హుస్సేన్సాగర్ ప్రాంతా న్ని ఆధునికంగా, చారిత్రాత్మక వారసత్వం ప్రతిబింబించేలా నిర్మాణాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా హుస్సేన్సాగర్ తీరంలోని ఇందిరాగాంధీ, పీవీఎన్ఆర్ విగ్రహం సర్కిల్ నుంచి బీ.ఆర్.అంబేద్కర్ విగ్రహం వరకు ఉన్న ప్రాంతంలో స్తంభాలను ఏర్పాటు చేసి, వాటికి వేలాడే పూల కుండీలను అమర్చుతున్నారు. యూరోపియన్ నగరాల్లో ఇలాంటి పూల మొక్కలను ఏర్పాటు చేయడం నుంచి ప్రేరణ పొంది, నగరంలో మొదటిసారిగా ఎన్టీఆర్ మార్గ్లో ఏర్పాటు చేస్తున్నామని పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్కుమార్ ట్వీట్ చేశారు. ఇప్పటికే హైదరాబాద్-సికింద్రాబాద్ నగరాల వారధిగా ఉన్న ట్యాంక్ బండ్ సుందరీకరణ పనుల కోసం సుమారు రూ.27 కోట్లు వెచ్చించిన హెచ్ఎండీఏ, కొత్తగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి బ్రిడ్జీ, లుంబినీ పార్కు ముందు ఎన్టీఆర్ ఘాట్, ఎన్టీఆర్ పార్కు మీదుగా నెక్లెస్ రోడ్డు వరకు రూ.9 కోట్ల వ్యయంతో పనులు చేపట్టారు. నెక్లెస్ రోడ్డులో ఇరువైపులా వాకర్స్, పాదచారులు, పర్యాటకులను ఆకట్టుకునేలా ఫుట్పాత్లను ఆధునీకరించనున్నారు. ఇందులో భాగంగా హెరిటేజ్ ఆర్కిటెక్చరల్ అర్నమెంటల్ డెకోరేటివ్ కాంబో స్ట్రీట్ లైట్స్ స్తంభాలు,అర్నమెంటల్ కాస్ట్ ఐరన్ గ్రిల్స్, ప్రీ కాస్ట్ ప్లాట్ బ్లాక్ వంటివి కొత్తగా ఏర్పాటు చేసి నెక్లెస్ రోడ్డును ఆధునీకరిస్తున్నారు.
టూరిజం హబ్గా సాగర తీరం…
హుస్సేన్సాగర్ చుట్టూ ఉన్న తీర ప్రాంతం మొత్తాన్ని ఆకర్షణీయంగా ఉండేలా రకరకాల ప్రాజెక్టులను హెచ్ఎండీఏ చేపడుతున్నది. నగరం నడి బొడ్డున ఉన్న ఈ జలాశయాన్ని పూర్తిగా పర్యాటక ప్రదేశాలకు కేరాఫ్ అడ్రస్ అనేలా పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపడుతున్నారు. నగర వాసులే కాకుండా దేశ, విదేశాలకు చెందిన పర్యాటకులు సైతం హుస్సేన్ సాగర్ తీరంలో ఒక రోజంతా పూర్తి స్థాయిలో గడిపేలా ఆయా ప్రాంతాలను ఆధునీకరిస్తున్నారు. తెలుగుతల్లి విగ్రహం నుంచి మొదలు ట్యాంక్బండ్ మీదుగా రాణిగంజ్, సంజీవయ్య పార్కు, పీవీ.ఘాట్, నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్ ఇలా అన్ని ప్రాంతాలు హుస్సేన్సాగర్ తీరంలో పర్యాటకులకు కనువిందు చేసేలా మారాయి. వీటికి మరింత అదనపు హంగులను కల్పిస్తూ అంతర్జాతీయ నగరాల అందాలకు ఏమాత్రం తీసి పోని విధంగా సాగర్ తీర ప్రాంతాన్ని హెచ్ఎండీఏ అభివృద్ధి చేస్తోంది.