ఉప్పల్, జనవరి 17 : ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో బుధవారం భారత్- న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగనున్న వన్డే క్రికెట్ మ్యాచ్ కోసం సర్వం సిద్ధం చేశారు. ఈ మేరకు క్రికెట్ మ్యాచ్ సజావుగా సాగేలా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు చర్యలు చేపట్టారు. మ్యాచ్ నేపథ్యంలో మంగళవారం ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ వివరాలను వెల్లడించారు.
పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశాం..
క్రికెట్ అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా 2500 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామని సీపీ తెలిపారు ఎంట్రీ, ఎగ్జిట్ బోర్డుల ఏర్పాటుతో ప్రేక్షకులకు ఇబ్బంది లేకుండా చేశామన్నారు. ప్లేయర్స్కు ఎలాంటి ఇబ్బంది కలిగించినా చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసినట్టు చెప్పారు. బ్లాక్ టికెటింగ్పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నూతనంగా వీఐపీల కోసం మరో గేటు ఏర్పాటు చేశామన్నారు. మ్యాచ్ నేపథ్యంలో పరిసర ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని తెలిపారు.
నిరంతర నిఘా.. భద్రత
స్టేడియం సౌత్సైడ్లో జాయింట్ కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. వీటి ద్వారా సీసీ కెమెరాలను పర్యవేక్షిస్తూ, సంఘటనలపై తక్షణం స్పందించే విధంగా ఐటీ బృందం పని చేస్తుంది. సమాచారాన్ని సిబ్బందికి చేరవేసే విధంగా ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు. నిషేధిత వస్తువులు తీసుకురాకుండా పటిష్టమైన స్కానర్తోపాటుగా, బాంబు డిస్పోజల్ టీం, పోలీసు జాగిలాలతో పర్యవేక్షణ చేపట్టనున్నారు. మహిళా భద్రత, ఈవ్టీజింగ్ను అరికట్టడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా 4 అంబులెన్సులు, 4 ఫైర్ ఇంజన్లను కూడా అందుబాటులో ఉంచారు.
ప్రధాన రహదారిలో పార్కింగ్ నిషేధం..
స్టేడియం ప్రాంతంలోని ప్రధాన రహదారుల్లో పార్కింగ్ను నిషేధించారు. ప్రత్యేకంగా పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రామంతాపూర్ నుంచి వచ్చే వారు టీఎస్ ఐఐసీ పార్కింగ్ ప్రాంతంలో పార్కు చేసుకోవాలని సూచించారు. పార్కింగ్ను సూచిస్తూ బోర్డులు ఏర్పాటు చేశారు. పార్కింగ్ స్థలాలు, వాహనాల ఎంట్రీ, వీఐపీ, వీవీఐపీ, వికలాంగులు, తదితరుల కోసం ప్రవేశించే ప్రదేశాలు, గేట్లను సూచిస్తూ ప్రత్యేకంగా సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు.
నిషేధిత వస్తువులు..
క్రికెట్ మ్యాచ్ నేపథ్యంలో స్టేడియంలోకి పలు వస్తువులపై నిషేధం విధించారు. ల్యాప్టాప్స్, వాటర్ బాటిల్స్, కెమెరాలు, సిగరెట్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు, మ్యాచ్బాక్స్, లైటర్స్, షార్ప్ మెటీరియల్, బైనక్యూలర్స్, కాయిన్స్, రైటింగ్ పెన్స్, బ్యాట్రిస్, హెల్మెట్స్, ఫెర్ప్యూమ్స్ బ్యాగ్స్పై నిషేధం విధించారు.
నేడు ఈ రూట్లో ట్రాఫిక్ రద్దీ..
సిటీబ్యూరో, జనవరి 17 (నమస్తే తెలంగాణ): ఉప్పల్ స్డేడియంలో బుధవారం ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల వరకు సోమాజిగూడ, గ్రీన్ ల్యాండ్స్, బేగంపేట్, రసూల్పుర, సీటీవో, ఎస్బీహెచ్, సంగీత్ జంక్షన్, ఆలుగడ్డ బావి, మెట్టుగూడ, తార్నాక, హబ్సిగూడ ఉప్పల్ రూట్లలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని నగర ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్బాబు తెలిపారు. ఈ రూట్లలో ప్రయాణించే వారు, ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లి తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని అదనపు సీపీ సూచించారు.
300 సీసీ కెమెరాలు..
క్రికెట్ మ్యాచ్ నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మేరకు ప్రత్యేక బలగాలతో భద్రత కల్పిస్తున్నారు. సెక్యూరిటీ వింగ్-250, ట్రాఫిక్-403, లా అండ్ ఆర్డర్ 1091, టీఎస్ఎస్పీ 4 ప్లాటూన్స్, ఆక్టోపస్ 2 బృందాలు, మౌంటెడ్ పోలీస్-10, వజ్ర-10, ఎస్బీ, సీసీఎస్, ఎస్ఓటీ, 2 ఫైర్ ఫైటింగ్ స్కాడ్తో సహా 2500 మంది పోలీస్ సిబ్బందితో బందో బస్తును ఏర్పాటు చేశారు. స్టేడియం చుట్టూ 300 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, వాటి పర్యవేక్షణ నిరంతరం కొనసాగించనున్నారు. వెహికిల్ చెక్ పాయింట్స్, పార్కింగ్ ప్రదేశాలతోపాటుగా పూర్తిస్థాయి స్టేడియంను సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంచారు.
బ్లాక్లో టికెట్లు
17 కేసులు.. 18 మంది అరెస్టు
సిటీబ్యూరో, జనవరి 17 (నమస్తే తెలంగాణ): ఉప్పల్ స్టేడియంలో ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్కు సంబంధించిన టికెట్లు బ్లాక్లో విక్రయిస్తున్న వారిపై రాచకొండ ఎస్వోటీ పోలీసులు కొరఢా ఝలిపించారు. ఎల్బీనగర్, మల్కాజిగిరి ఎస్ఓటీ ఇన్స్పెక్టర్లు సుధాకర్, రాములు బృందాలు నిఘా పెట్టి 18 మందిని అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 59 టికెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో కొందరు సోషల్ మీడియా వేదికగా తమ వద్ద టికెట్లు ఉన్నాయంటూ ప్రకటన ఇచ్చి బ్లాక్లో విక్రయించారు. మరికొందరు ఆన్లైన్లో కొనుగోలు చేసిన టికెట్లను బ్లాక్లో విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. నిందితులు ముగ్గు సంజీవ్, తాళ్లపళ్లి అశోక్, వేణు, జి.రమేశ్తో సహా 18 మందిని అరెస్టు చేశారు. ఈ కేసును తదుపరి విచారణ నిమిత్తం ఉప్పల్ పోలీసులకు అప్పగించారు.