2500 మంది సిబ్బందితో భారీ బందోబస్తు
కమాండ్ కంట్రోల్ నుంచి పర్యవేక్షణ
భద్రతను పర్యవేక్షిస్తున్న సీపీ సీవీ ఆనంద్
సిటీబ్యూరో, మే 25(నమస్తే తెలంగాణ): ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించి సైబరాబాద్ పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మొత్తం 2500 మందికి పై సిబ్బందిని మొహరించారు. గురువారం మధ్యాహ్నం ఐఎస్బీలో జరిగే ద్విదశాబ్ది వేడుకల్లో మోదీ పాల్గొంటారు. ఈ సందర్భంగా భద్రతను హైదరాబాద్ పోలీస్ కమిషనర్, సైబరాబాద్ ఇన్చార్జి సీపీ సీవీ ఆనంద్ పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ఎస్పీజీ కార్యక్రమం జరిగే ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. వారికి మద్ధతుగా ఎన్ఎస్జీ, అక్టోపస్, గ్రేహాండ్స్, ఎస్ఓటీ, స్పెషల్ ఫోర్స్, కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలు, సైబరాబాద్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు బందోబస్తులో ఉన్నారు. దీనికి తోడుగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిరంతరం సోషల్ మీడియా మానిటరింగ్ను నిర్వహిస్తున్నారు.
కమాండ్ కంట్రోల్ ద్వారా నిత్యం పీఎం కార్యక్రమంతో పాటు చుట్టూ పరిసరాల్లోని ప్రదేశాలను సీసీ కెమెరాల ద్వారా కనిపెడుతున్నారు. ఇంటిగ్రేటెడ్ ఆపరేటివ్ సెంటర్ నుంచి నిత్యం లైవ్లో భద్రత ఏర్పాట్లను పోలీసులు వీక్షిస్తున్నారు. ఏ చిన్న అనుమానం వచ్చినా.. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. సీపీ సీవీ ఆనంద్, సైబరాబాద్ జాయింట్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి, మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, ఇతర డీసీపీలు, అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, మహిళా అధికారులు, సిబ్బంది మొత్తం బందోబస్తులో నిమగ్నమయ్యారు.